న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ మే 1 (శనివారం) నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ‘కొవిన్’ వెబ్ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకొని, స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకాను వేస్తామని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. స్పాట్ రిజిస్ట్రేషన్లను ఎంతమాత్రం అనుమతించబోమని తెలిపాయి. 18 ఏండ్లు పైబడిన అందరికీ టీకాల కార్యక్రమం మొదలవ్వగానే వ్యాక్సిన్ కోసం పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశమున్నదని, దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చని అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేందుకే, 18-44 ఏండ్ల వయసువారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్టు తెలిపారు. 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, టీకా కేంద్రంలో సైతం వాళ్లు (45 ఏండ్లు పైబడిన వారు) పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 28 (బుధవారం) నుంచి 18 ఏండ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘కొవిన్’ వెబ్ పోర్టల్ లేదా ‘ఆరోగ్యసేతు’ యాప్లో వివరాలు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
18-44 ఏండ్ల వయసు వారి కోసం శనివారం నుంచి మూడోదశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. అయితే, వేసుకునే టీకా, కేంద్రాన్ని ఎంచుకునే సదుపాయం ప్రజలకు కల్పించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పేర్లను నమోదు చేసుకునే సమయంలోనే ‘కొవిన్’ పోర్టల్లో వ్యాక్సిన్ పేరు, ధర, టీకా కేంద్రం (ప్రభుత్వ, ప్రైవేట్) వంటి వివరాలు కనిపిస్తాయని, వాటిని అనుసరించి రిజిస్ట్రేషన్ను చేసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ వేయనున్న ప్రైవేట్ దవాఖానలు.. కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ (సీవీసీ) వివరాలను, వేయనున్న టీకా పేరు, నిల్వలు, నిర్ణయించిన ధరను ‘కొవిన్’ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని తెలిపింది. ఈ మేరకు రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే ప్రైవేట్ సీవీసీల్లో టీకాలు వేస్తారని తెలిపారు. ప్రభుత్వ సీవీసీలో కూ డా టీకాలను పొందవచ్చన్నారు. ప్రైవేట్ సీవీసీ అనుమతులపై రాష్ట్ర/జిల్లాస్థాయి యంత్రాంగాలే నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
వ్యాక్సినేషన్కి అర్హులు: 18 ఏండ్లు పైబడినవారు
రిజిస్ట్రేషన్ ప్రారంభం: బుధవారం (ఏప్రిల్ 28)
పేర్ల నమోదు వేదికలు: కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్
వ్యాక్సినేషన్ ప్రారంభం: శనివారం (మే 1)
తమ రాష్ర్టాల్లో 18 నుంచి 45 ఏండ్లలోపు వారికి ఉచితంగా కరోనా టీకా వేస్తామని మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్ ప్రభుత్వాలు ఆదివారం ప్రకటించాయి. 18 ఏండ్లు పైబడిన వారికి వచ్చే నెల 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాలు టీకాను ఉచితంగా అందించాలని నిర్ణయిం చాయి. తమ రాష్ట్రంలో 18-45 వయసు వారికి ఉచిత టీకా వేసేందుకు 2 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.