భువనేశ్వర్ : ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని శరత్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేబన్బహల్లి గ్రామంలో పలువురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అలాగే వాహనాన్ని ధ్వంసం చేశారు. ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవడంతో దాడి చేశారని ఏఎస్ఐ మహాపాత్ర తెలిపారు. గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి చైతిపర్బా (చైత్రమాసం పండుగ) జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎక్కువగా జనం గుమిగూడవద్దని చెబుతుండగా.. వాహనం ధ్వంసం చేసి, తమపై దాడి చేశారని మహాపాత్ర తెలిపారు.
ఈ ఘటనలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో ఉడాలా సబ్డివిజనల్ హాస్పిటల్కు.. పరిస్థితి విషమంగా ఉండడంతో బారిపాడ జిల్లా ప్రధాన హాస్పిటల్కు తరలించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మే 5 నుంచి రాష్ట్రంలో 14 రోజుల లాక్డౌన్ను ఒడిశా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోహపాత్రా జారీ చేసిన ఉత్తర్వుల్లో వారాంతాలు మినహా మిగతా అన్ని రోజుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని.. లాక్డౌన్ 19 వరకు అమలులో ఉంటుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.