కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్తో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో తొలి ఏకాదశి ( Toli Ekadashi ) ని పురస్కరించుకొని మండల ప్రజలు ఉపవాసాలకు ఉపక్రమించి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
కుభీర్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మరో పండరిపురంగా వెలుగొందిన శ్రీ విఠలేశ్వరాలయం ( Vithaleshwara Temple ) లో తెల్లవారుజామునే విఠలేశ్వరుడు – రుక్మిణి విగ్రహాలకు పంచామృత అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలను సమర్పించారు. పుష్పార్చన, హారతి తో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రమోద్ జోషి, రాజు మహారాజ్ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉదయం నుంచి భక్తులు ఆలయంలో భజనలు చేస్తూ నిమగ్నమయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఆలయంలో విట్టల్ మహారాజ్ కీర్తనలు రాత్రి వరకు కొనసాగనున్నాయి. చాత, పార్డి కె లోని తొలిసారి ఆలయాల్లో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ఉదయం ఉపవాస దీక్షలను భక్తులు విరమించనున్నారు.