హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): విద్వేషాలు రెచ్చగొడుతూ.. అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలనుకున్న బీజేపీకి సాగర్ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. కమలానిది బలుపు కాదు.. వాపేనని గుర్తుచేశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా బొందపెట్టారు. చివరకు నోటాకు వచ్చే ఓట్లతో పోటీపడుతూ అందులోనూ చతికిలపడిపోయింది. దుబ్బాక గెలుపు గాలివాటమేనని ఆ పార్టీ నేతలకు తెలిసొచ్చేలా చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో స్థానిక సమీకరణాలు, అబద్ధాలతో చావుతప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచిన బీజేపీ.. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్నిస్థానాల్లో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో రాష్ట్రంలో తమ కు ఎదురేలేదంటూ విర్రవీగారు. తొలినుంచి బీజేపీ నేతలు సోషల్మీడియాను ఆసరాగా చేసుకొని అసత్య ప్రచారాలకు తెగబడుతూ వస్తున్నారు. అన్నిఅంశాల్లో విఫలమవుతున్న కేంద్రాన్ని వెనుకేసుకొస్తూ.. ప్రజల కోసం నిరంతరం కృషిచేస్తున్న సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేయడమే పరిపాటిగా మార్చుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తూ .. రాష్ట్రప్రభుత్వంపై బట్టకాల్చి మీదవేస్తూ వచ్చారు. బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సాగర్ ఉప ఎన్నికను చక్కగా వినియోగించుకున్నారు. వాపును బలుపుగా భావిస్తూ ఆకాశంలో విర్రవీగుతున్న వారిని నేలకుదింపారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినా బుద్ధిరాని బీజేపీకి.. సాగర్లో కర్రుకాల్చి వాతపెట్టారు.