హైదరాబాద్ : దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నది. మరోవైపు, ఆదివారం ఉదయం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
కొన్నిచోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎల్కతుర్తిలో 106 మిల్లీమీటర్లు, కమలాపూర్లో 75.5 మి.మీ, హసన్పర్తిలో 73.5 మి.మీ వర్షాపాతం నమోదైంది.