కామేపల్లి, సెప్టెంబర్ 1: పేదలకు పంచే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. గురువారం కామేపల్లిలోని రైతువేదిక భవనంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు అక్కడి సంపదను కుబేరులకు దోచిపెడ్డుతున్నాయని, సీఎం కేసీఆర్ మాత్రం పేదలకు సాయం చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పింఛన్ సీఎం ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతులు, వృద్ధులకు పింఛన్లు వస్తున్నాయన్నారు. త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, కొండాయిగూడెం, కామేపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, వైస్ ఎంపీపీ అజ్మీరా విజయలక్ష్మి పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
ముదిగొండ, సెప్టెంబర్ 1: అర్హులందరికీ పింఛన్లు అందుతాయని ఎమ్మెల్నీ తాతా మధు అన్నారు. ముదిగొండలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు పింఛను కార్డులు అందజేసి మాట్లాడారు. మండలంలో కొత్తగా 2,195 మందికి పింఛన్లు మంజూరయ్యాయన్నారు. సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడదన్నారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే పార్టీల నాయకులు కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చాకే వృద్ధులకు పింఛను పెరిగిందన్నారు. పింఛను రాకపోయిన వారు ఆందోళన చెందవద్దన్నారు. మధిర నియెజకవర్గంలో ముదిగొండ మండలానికే ఎక్కువ పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. నిధుల మంజూరు విషయంలో కేంద్రం రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు తోట ధర్మారావు, యర్ర వెంకన్న, బ్రహ్మారెడ్డి, చిరుమర్రి యల్లయ్య పాల్గొన్నారు.