అదే రామాయణం..
అదే మహాభారతం..
వెండితెరపై ఎన్నిసార్లు వచ్చినా కండ్లారా చూడటం తెలుగు ప్రేక్షకుడి రివాజు. భారతంలోని పర్వాలను సినిమాలుగా నేత్రపర్వంగా తీర్చిదిద్దిన ప్రతిసారీ వన్స్మోర్ కొట్టడం మనకుఅలవాటు. రామాయణ, భారతాలే కాదు.. సాంఘిక,
పౌరాణిక, చారిత్రక, ప్రేమ కథలెన్నో వెండితెరపై మళ్లీమళ్లీవచ్చి.. మాతృకలను మించిన విజయాలు అందుకున్నాయి. ఈ ప్రయత్నంలో బొక్కబోర్లా పడ్డ సినిమాలూ ఉన్నాయి. జయాపజయాల సంగతి అటుంచితే.. పునర్నిర్మాణానికి నోచుకొని.. ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమాల సంగతులు ఇవి..
Telugu Movie | తెలుగు టాకీ మొదలైంది ‘భక్తప్రహ్లాద’ (1932) సినిమాతో. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీమద్భాగవతంలోని నరసింహ అవతార నేపథ్యంలో జరిగే కథ. ఆ కథనే 1967లో అదే పేరుతో ఏవీఏం ప్రొడక్షన్వారు పునర్నిర్మించారు. దీనికి దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి. ఎస్వీ రంగారావు, అంజలీదేవి, హరనాథ్ తదితరులు నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎస్.రాజేశ్వరరావు స్వరపరిచిన ఇందులోని పాటలు నేటికీ కర్ణపేయమే. ఈ సినిమా కంటే ముందే 1958లో దర్శకుడు బీఏ సుబ్బారావు ‘చెంచులక్ష్మి’ సినిమా చేశారు. ఈ సినిమా కథ కూడా సగం అదే. మిగతా కథ నృసింహావతారానికి కొనసాగింపుగా ఉంటుంది.
మహాభారతంలోని పాత్రలతో అల్లిన కల్పిత కథ ‘శశిరేఖాపరిణయం’. అప్పటివరకూ రంగస్థలంపై నాటకంగా ఉన్న ఈ కథను 1936లో ‘మాయాబజార్’ పేరుతో తెరకెక్కించారు. అదే కథ 1957లో అదే పేరుతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ అద్వితీయ కళాఖండానికి దర్శకుడు కె.వి.రెడ్డి. తెలుగు సినిమా చరిత్రలో ‘మాయాబజార్’ది సువర్ణాధ్యాయం. ఈ సినిమా గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నాయి. నేటికీ ఫిల్మ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి ‘మాయాబజార్’ ఓ పాఠ్యాంశం. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, రుష్యేంద్రమణి, సూర్యకాంతం, గుమ్మడి, సీఎస్ఆర్ ఇలా తెలుగు సినిమాను వెలిగించిన మహనీయ నటులందరూ నటించిన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రైడ్.
దర్శకుడు పి.పుల్లయ్య 1937లో తెరకెక్కించిన హిస్టారికల్ డ్రామా ‘సారంగధర’. బందా కనకలింగేశ్వర్రావు టైటిల్రోల్ చేశారు. ఇదే కథ 1957లో మళ్లీ తెరకెక్కింది. వీయస్ రాఘవన్ దర్శకుడు. ఇందులో టైటిల్రోల్ ఎన్టీయార్ చేశారు. ఇంకా ఎస్వీఆర్, భానుమతి రామకృష్ణ, రాజసులోచన వంటి ఉద్దండులు నటించిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.
పి.పుల్లయ్య పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’. 1960లో విడుదలైన ఈ సినిమా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విడుదలైన థియేటర్లన్నీ దేవాలయాలయ్యాయి. ఎన్టీఆర్ ఇమేజ్ను సమూలంగా మార్చేసిన సినిమా ఇది. తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తజనం మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ని దర్శించుకునే సంప్రదాయానికి తెరలేపిన సినిమా కూడా ఇదే! విశేషమేంటంటే.. ఇదే పి.పుల్లయ్య ఇదే కథతో ఈ సినిమా కంటే ముందు.. అంటే 1939లో ‘బాలాజీ’ అనే సినిమా తీశారు. అందులో వేంకటేశ్వరస్వామిగా చిలకలపూడి సీతారామాంజనేయులు (సీఎస్ఆర్) నటించారు. ఆ సినిమా కూడా పెద్ద హిట్. అయితే.. ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ మాత్రం తెలుగు సినిమా టాప్ 10 క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయింది.
పుల్లయ్య దర్శకత్వంలో 1942లో రూపొందిన చందమామ కథ ‘బాలనాగమ్మ’. రామాయణాన్ని ప్రేరణగా తీసుకొని రాసుకున్న కథ ఇది. ఇందులో టైటిల్ రోల్ను కాంచనమాల పోషించారు. మహానటుడు గోవిందరాజుల సుబ్బారావు మాయలఫకీర్గా నటించారు. ఈ సినిమా అప్పట్లో హిస్టారికల్ హిట్. ఇదే కథ మళ్లీ 1959లో పునర్నిర్మితమైంది. ఇందులో బాలనాగమ్మగా అంజలీదేవి నటించగా, కార్యవర్ధి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఇక మాయలఫకీర్గా ఎస్వీఆర్ విశ్వరూపం చూపించేశారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్.
చిత్తూరు నాగయ్య స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన భక్తిరస సంగీతకావ్యం ‘త్యాగయ్య’ 1946లో విడుదలైన ఈ సినిమా వాణిజ్యపరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. త్యాగయ్యగా ఆచంద్రతారార్కం నిలిచిపోయేంత అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు నాగయ్య. ఇదే కథను జేవీ సోమయాజులుతో అదే టైటిల్తో తెరకెక్కించారు దర్శకుడు బాపు. 1981లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య నటించిన ‘యోగి వేమన’ (1947) చిత్రం కూడా పెద్ద విజయం సాధించింది. అదే కథతో ‘వేమన చరిత్ర’ అని విజయ్చందర్ ఓ సినిమా చేశారు. 1986లో విడుదలైన ఆ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.
కొంతభాగం గూడవల్లి రామబ్రహ్మం, కొంతభాగం ఎల్వీప్రసాద్ దర్శకత్వం వహించిన పలనాటి వీరగాథ ‘పల్నాటియుద్ధం’ (1947). గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడిగా, కన్నాంబ నాయకురాలు నాగమ్మగా, అక్కినేని బాలచంద్రుడిగా నటించిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది. అదే చరిత్రను అదే పేరుతో 1966లో మళ్లీ తీశారు. రామినేని దర్శకుడు. ఇందులో బ్రహ్మనాయుడుగా ఎన్టీ రామారావు నటించగా, నాయకురాలు నాగమ్మ పాత్రను భానుమతి పోషించారు. హరనాథ్ బాలచంద్రుడు. జమున, బాలయ్య, వాసంతి, రాజనాల ఇతర పాత్రధారులు. మాతృక అంత కాకపోయినా ఈ సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది.
ఇక ప్రేమకథల్లో మకుటాయమానం అక్కినేని ‘దేవదాసు’ (1953). శరత్చంద్ర నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ కన్నీటి ప్రేమకావ్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదే నవల ఆధారంగా ఇతర భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కినా, అక్కినేని ‘దేవదాసు’ దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా రాలేకపోయింది. “దేవదాసు’ అంటే అక్కినేని మాత్రమే’.. అని దిలీప్కుమార్ లాంటి మహానటుడే కొనియాడాడంటే.. అందులో అక్కినేని అభినయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ కథనే మళ్లీ తీసి, ఆ పాత్రను తనే చేసి.. పెద్ద సాహసమే చేశారు సూపర్స్టార్ కృష్ణ. విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ ‘దేవదాసు’ 1974లో విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ నటించిన తొలి సినిమా ‘కాళహస్తి మహాత్మ్యం’. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కి, 1954లో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. హెచ్.ఎల్.ఎన్.సింహా దర్శకుడు. ఇదే కథతో బాపు దర్శకత్వంలో ‘భక్తకన్నప్ప’ చిత్రాన్ని నిర్మించారు రెబల్స్టార్ కృష్ణంరాజు. అందులో కన్నప్పగా టైటిల్ రోల్ ఆయనే పోషించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ కథ మళ్లీ తెరకెక్కుతుండటం విశేషం. మంచు విష్ణు కథానాయకుడిగా మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పేరు ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్సింగ్ దర్శకుడు.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన మరో అజరామర ప్రేమకావ్యం ‘అనార్కలి’ (1955). అంజలీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అప్పటి జనం నీరాజనాలు పట్టారు. అనార్కలిగా అంజలీదేవి, సలీంగా అక్కినేని, అక్బర్గా ఎస్వీ రంగారావు అనితర సాధ్యమైన అభినయాన్ని కనపరిచారు. ముఖ్యంగా ఆదినారాయణరావు స్వరాలు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇదే కథను తీసుకొని 1979లో ‘అక్బర్ సలీం అనార్కలి’ తీశారు ఎన్టీఆర్. అందులో అక్బర్గా ఎన్టీఆర్, సలీంగా బాలకృష్ణ, అనార్కలిగా దీప నటించారు. సినిమా ఘోర పరాజయం పాలైంది.
1960లో ఎస్వీ రంగారావు హీరోగా ‘హరిశ్చంద్ర’ సినిమాను నిర్మించారు లక్ష్మీరాజ్యం. ఇందులో చంద్రమతిగా ఆమే నటించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. అదే కథతో విజయా సంస్థ కె.వి. రెడ్డి దర్శకత్వంలో ‘సత్యహరిశ్చంద్ర’ (1965) చిత్రాన్ని నిర్మించింది. హరిశ్చంద్రుడిగా ఎన్టీ రామారావు నటించారు. అప్పటికే మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ను ఇలా సాత్వికమైన పాత్రలో జనం చూడలేకపోయారు. దాంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఎన్టీఆర్ భక్త పుండరీకుడిగా, భోగలాలసుడిగా అద్భుతంగా నటించి, నిర్మించిన భక్తిరస చిత్రరాజం ‘పాండురంగ మహాత్మ్యం’ (1957). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో టీవీ రాజు స్వరపరిచిన పాటలు నేటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఈ కథ మళ్లీ 51 ఏండ్ల తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’గా పునర్నిర్మితమైంది. ఇందులో పుండరీకుడిగా, పాండురంగడిగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. సినిమా సరిగ్గా ఆడలేదు.
ఎన్టీఆర్ బృహన్నలగా, ఎస్వీఆర్ కీచకుడిగా, సావిత్రి ద్రౌపదిగా జీవించిన ‘నర్తనశాల’ (1963) తెలుగు సినిమా టాప్ 10 క్లాసిక్స్లో ఒకటి. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్ర దర్శకుడు. ఇదే కథను ‘శ్రీమద్విరాటపర్వం’ పేరుతో మళ్లీ తీసి, దారుణమైన ఫ్లాప్ను మూటగట్టుకున్నారు ఎన్టీఆర్.
అలాగే తెలుగు నేలపై జరిగిన మరో వీరగాథ ‘బొబ్బిలియుద్ధం’. 1964లో సి.సీతారాం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రంగరాయలుగా ఎన్టీఆర్, తాండ్ర పాపారాయుడుగా ఎస్వీఆర్ నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇదే కథతో దర్శకుడు దాసరి ‘తాండ్ర పాపారాయుడు’ తెరకెక్కించారు. 1986లో విడుదలైన ఈ చిత్రం హిట్ అయింది. ఇందులో టైటిల్ రోల్ను కృష్ణంరాజు పోషించారు.
ఇప్పుడు మనం గుర్తు చేసుకుంది మచ్చుకు కొన్నే.. లోతుగా వెళ్తే ఇంకా ఎన్నో! మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. సక్సెస్ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. సక్సెస్ వెనుక పరుగెడుతుంటుంది. నిత్యం సక్సెస్ నామస్మరణతో తరించిపోతుంటుంది. జనం మెచ్చిన కథలతో సినిమాలు తీయడమే సక్సెస్ ఫార్ములా. కాకపోతే.. తీయాల్సిన వాళ్లు తీయాలి.. చేయాల్సిన వాళ్లు చేయాలి. అప్పడే సినిమా జనరంజకం అవుతుంది.
ఎన్టీఆర్ ‘లవకుశ’ (1963) సినిమా గురించి తెలియని వారుండరు. వాణిజ్యపరంగా తెలుగు సినిమా ‘కోటి’ అనే అంకెను చూసింది ‘లవకుశ’తోనే. 47 ఏండ్ల తర్వాత అదే కథతో సినిమా చేశారు దర్శకుడు బాపు. ఆ సినిమానే ‘శ్రీరామరాజ్యం’. ఇందులో రాముడిగా బాలకృష్ణ నటిస్తే, సీతగా నయనతార కనిపించారు. ‘లవకుశ’ అంత కాకపోయినా ‘శ్రీరామరాజ్యం’ కూడా బాగానే ఆడింది.
…? నరసింహ బుర్రా