Hyderabad | సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): ఒకవైపు ఎండలు మండుతుంటే.. మరో వైపు ఇండ్లల్లో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఒక్క క్షణం కరెంటు లేకపోయినా ఇంట్లో ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లినా సెగలు కక్కుతున్న ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు నగర వాసులు. దీంతో ఏసీలు, కూలర్లు, ప్యాన్లు ఇలా అన్నీ రోజంతా పనిచేస్తుండటంతో విద్యుత్ వినియోగం రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అందుకు తాజా నిదర్శనం మే నెల ప్రారంభమైన 3 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రోజును మించి మరో రోజు విద్యుత్ వినియోగం నమోదవుతోంది.
మే 3న గతంలో ఎన్నడూ నమోదు కాని విద్యుత్ వినియోగం 89.71 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. మార్చి నుంచి మొదలైన విద్యుత్ వినియోగం మే నెలలోనూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతేడాదిలో ఇదే సమయంలో మే నెల 1,2,3 తేదీల్లో నమోదైన విద్యుత్ వినియోగం, ఫీక్ అవర్ డిమాండుతో పోల్చితే విద్యుత్ వినియోగం అత్యధికంగా వృద్ధిరేటు 69.20 శాతం నమోదు కాగా, డిమాండులో 58.37 శాతం నమోదైందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇదే తీరుగా ఎండల తీవ్రత ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 100 మిలియన్ యూనిట్లు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.