CM Revanth Reddy | హామీల అమలులో వైఫల్యం విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈసరికి బాగానే అర్థమైనట్టున్నది. వైఫల్యం గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం వేరు, స్వయంగా ప్రజలు మాట్లాడటం వేరు. వాస్తవాలు ప్రతిపక్షాలకు మాత్రమే తెలిసినప్పుడు ముఖ్యమంత్రి మానసిక స్థితి ఒకవిధంగా ఉంటుంది. ఆ దశలో మానసిక ధైర్యం సడలిపోదు. ప్రతిపక్షాలను తేలికగా ఎదురుకోగలనని నమ్ముతారు. ఆ ప్రకారం విమర్శకులపై ఎదురుదాడి, బుకాయింపులు ఉంటాయి. ఆ విధంగా చెలాయించవచ్చుననుకుంటారు. రేవంత్రెడ్డి అటువంటి ప్రయత్నం కొద్దివారాల పాటు చేశారు కూడా. ఒకవేళ హామీల వైఫల్యం కొద్దిస్థాయిలో ఉండి ఉంటే, ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా అది చెల్లుబాటుకాకపోయేది. ముఖ్యమంత్రి ఎదురుదాడి ఎత్తుగడ ఫలించేది.
కాంగ్రెస్ హామీల్లోని ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే.. వంద రోజుల్లో 6 గ్యారంటీలలోని 13 హామీల అమలులో వైఫల్యాలు చాలా పెద్దవి. అదే పద్ధతిలో తేదీలతో సహా గడువు పెట్టినవి రూ.2 లక్షల రైతు రుణమాఫీ వంటివి మరికొన్ని ఉన్నాయి. ఈ వైఫల్యాల గురించి ప్రతిపక్షాల విమర్శలు మామూలే అనుకున్నా, ఆ మాట ప్రజలకు సైతం అర్థమైందనుకున్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి మానసిక స్థితి మారుతుంది. విమర్శలను బుకాయింపులతో తోసిపుచ్చగలననే ధీమాకు బదులు కలవరపాటు మొదలవుతుంది. ఎదురుదాడుల వల్ల ఉపయోగం ఉండదని తెలిసిపోవటం ఒక నిస్సహాయ స్థితి. అపుడు కలవరపాటు మరింత పెరుగుతుంది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది నిస్సహాయ స్థితి బయటి పరిస్థితుల వల్ల ఏర్పడటం కన్న, అంతర్గత పరిస్థితుల వల్ల ఏర్పడటం ఎక్కువ ప్రమాదకారి. హామీల అమలులో వైఫల్యం ఒక వాస్తవమని ముఖ్యమంత్రికి తెలుసు. ఇతరుల విమర్శలకన్న ఎక్కువగా తెలుసు. ఏ విధంగానైతే ఆర్థిక పరిమితులు ప్రస్తుత వైఫల్యానికి కారణమయ్యాయో, అవే పరిమితులు రాగల కాలంలో మరింత తీవ్రమైన వైఫల్యాలకు కారణం కాగలవని కూడా తెలుసు. కేవలం అధికార సంపాదన కోసం ఇచ్చిన అసాధ్యపు హామీలు తనకొక కత్తుల బోనును సృష్టించాయని తనకు ఈ తొలిదశలోనే అర్థమైనట్టు కనిపిస్తున్నది.
అయితే ఈ వాస్తవాలలో దేనిని కూడా ఇప్పుడాయన మార్చలేరు. మార్చలేరన్నది గ్రహించలేనివాడేమీ కాదాయన. వాస్తవానికి ఇది తాను ఈ రాష్ట్రస్థాయిలోనే గాక, తమ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అధికార రాహిత్యపు ఎడారిలో నీటిచుక్కల కోసం నాలుక పిడచగట్టుకపోతుండగా, సోకాల్డ్ కృత్రిమ స్ట్రాటజిస్టులపై ఆధారపడి, తమ సొంత వివేకానికి, దశాబ్దాల అనుభవానికి తిలోదకాలిచ్చి, తయారుచేయిస్తున్న వ్యూహాల అఖిల భారత ఊబిలో ఇదొక భాగం మాత్రమే. దానినుంచి ఏ రాష్ట్ర నాయకుడైనా కోరుకున్నప్పటికీ తప్పించుకోలేడు.
ఇటువంటి స్థితిలో రేవంత్రెడ్డి హామీలను అమలుచేయలేరు, వాటినుంచి వెనుకకు పోలేరు గనుక, ఇప్పుడు లోక్సభ ఎన్నికల రూపంలో ఒక కొత్త విపత్తు వచ్చిపడింది గనుక, ఇవి ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరొక విపత్తు ఎదురుచూస్తున్నది గనుక, ఆయనకు మిగిలిన ఎత్తుగడలు కొన్నుంటాయి. మిగిలిన పరిష్కారాలు కాదు, మిగిలిన ఎత్తుగడలని గుర్తించాలి.
ఏదో ఒకవిధంగా వీలైనంత ప్రతిష్టను కాపాడుకోవటం ఆయన ప్రస్తుత అవసరం గనుక, తన మానసిక స్థితి కూడా అందుకు తగినట్టే ఉంటుంది. ఆ ప్రకారం ప్రస్తుతం తనకు మిగిలిన ఎత్తుగడల్లో ఒకటి, ఏదేమైనా సరేనని అవే అసత్యాలు ప్రతిరోజు, ప్రతిసభలో, ప్రతి మీడియా సమావేశంలో, అవకాశం లభించే ప్రతి సందర్భంలో మరింత గొంతెత్తి చెప్తూ పోవటం. రెండు, 6 గ్యారంటీలలోని 13 హామీల గురించి గాని, తేదీలతో సహా గడువులు ప్రకటించిన ఇతర హామీల గురించి గాని ఎందరెందరు ఎన్నెన్నిసార్లు సూటిగా ప్రశ్నలు వేసినా ఒక స్థితప్రజ్ఞుని వలె వాటి జోలికిపోకపోవటం, వాటిని అసలు విననైనా విననట్లు నటించటం, తాము అటువంటి హామీలే ఇవ్వలేదన్నట్టు దిక్కులు చూడటం.
మూడు, ఆయా హామీల గురించి తమ మంత్రులు, పార్టీ నాయకులు తలొక విధంగా విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నా వారిని సరిదిద్దకపోవటం, అసలేమీ మాట్లాడకపోవటం. అందువల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడితే ఆ అయోమయం కూడా ప్రతిపక్షాల విమర్శలకు జవాబు కాగలదనే తెలివైన అంచనాలు. నాలుగు, ప్రజల దృష్టిని హామీల నుంచి రకరకాలుగా మళ్లించజూడటం. ఐదు, ప్రత్యర్థులపై రోజుకొక కొత్త ఆరోపణ, సవాళ్లు, కేసులు, లీకులు, సోషల్మీడియా కథనాలతో ప్రజల్లో వీలైనన్ని అయోమయాలు సృష్టించడం. ఆరు, ప్రజలు తమను, తమ మాటలను, మ్యానిఫెస్టోలను, హామీలను నమ్మడం తగ్గిపోతున్నదని గ్రహించడంతో, వారిని నమ్మించేందుకు ఆధునిక ప్రజాస్వామిక పద్ధతులను వదిలివేసి, మధ్యయుగాల్లో వలె రోజుకు ఒకరిద్దరు దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.
ఆ విధంగా తమ మానసిక బలహీనతను, నైతిక బలహీనతను, విశ్వసనీయత లేమిని చాటుకోవడం. అయితే ఇక్కడ రేవంత్రెడ్డి గాని, ఆయన పార్టీ గాని, సాధారణ ప్రజలు గాని గమనించవలసింది ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి తన ఆత్మరక్షణ స్థితి నుంచి, అటువంటి మానసిక స్థితి నుంచి అనుసరించే ఈ విధమైన ఎత్తుగడలు ఒకవేళ ప్రజల దృష్టిని హామీల అమలు నుంచి మళ్లించగలిగితే తప్పక ఫలితముంటుంది. కానీ మళ్లించలేకపోతే, తగిలే ఎదురుదెబ్బ మామూలు కన్నా తీవ్రంగా ఉంటుంది.
ముఖ్యమంత్రి అనూహ్యమైన రీతిలో ఎటువంటి పరిస్థితిలో చిక్కుకుపోయారో గమనించండి. తన ప్రస్తుత ఇరకాటపు మానసికస్థితికి మూలం అందులోనే ఉంది. ఆయన రుణమాఫీని ఆగస్టు 15 లోగా చేసితీరతామని భీకరమైన ప్రతిజ్ఞలు చేస్తారు. ఎందుకు అవసరమవుతున్నదో, ఎందువల్ల అటువంటి ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయో గాని, కనిపించిన దేవుడి మీదనల్లా ఒట్లు పెట్టుకుంటారు. స్వయంగా ప్రకటించిన డిసెంబర్ 9 గురించి ఈ అయిదు మాసాల్లో మాత్రం ఒక్కటంటే ఒక్కసారైనా, పొరపాటునైనా మాట్లాడలేదు. కనీసం, డబ్బులు కుదరలేదు అర్థం చేసుకోగలరు అంటూనైనా రైతులను కోరలేదు. ఆయన ఆత్మాభిమానం అంతటిది అనుకోవాలి కావచ్చు.
అట్లాగే, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేస్తానని, హరీశ్రావు తన రాజీనామాను సిద్ధం చేసుకోవాలని ప్రతిరోజు సవాలు విసురుతారు. కాని, ఒకవేళ మాఫీ చేయలేకపోతే తాను రాజీనామా చేస్తానని మాత్రం పొరపాటునైనా అనరు. ఎందుకు అనటం లేదంటే, మౌనం వహిస్తారు. ఈ రుణమాఫీ సవాళ్లు ఎదురుసవాళ్ల మధ్య 6 గ్యారంటీలు, 13 హామీల మాట మాత్రం పక్కకుపోవటం గమనించదగ్గ విశేషం.
ఆ ఆరు గ్యారంటీలలో అయిదు అమలుచేశామని పదే పదే ప్రకటిస్తారు. ఏమిటా అయిదంటే సమాధానమివ్వరు. ఎన్నిసార్లు లెక్కలు వేసినా అవేమిటో మనకూ తెలియవు. ఆరు గ్యారంటీల వందరోజుల గడువు ఎట్లాగూ గడిచిపోయింది. మరి కొత్త గడువేమిటో నేటివరకూ చెప్పటం లేదు. అందుకు కూడా ఆగస్టు పదిహేనా? అదైనా మాట్లాడరు. రుణమాఫీకి కొత్త గడువు ఆగస్టు 15 అంటూ తనను సవాలు చేస్తున్న ముఖ్యమంత్రి, కనీసం ఆ తేదీనాటికి అయినా 6 గ్యారంటీలలోని 13 హామీలు అమలు చేయగలరా అని హరీశ్రావు అడిగితే, ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన ఉండదు. రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడి ఊరుకుంటారు. దాన్నిబట్టి, అప్పటికైనా 6 గ్యారెంటీలకు గ్యారంటీ లేదనుకోవాలా?
తనకు తాను సృష్టించుకున్న ఇక్కట్లలో చిక్కుకుపోయిన రేవంత్రెడ్డి, ఈ విధమైన మానసిక స్థితిని కూడా తనకు తానే సృష్టించుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని పార్టీలు, అందరు నాయకుల మాటలు వింటున్న ప్రజలు, వీళ్లందరి తిట్లు తమకెందుకని, ప్రజల కోసం, సమస్యల కోసం, అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పాలని కోరుతున్నారు. అదట్లుండగా, తమ హామీలన్నీ ప్రజలకు సంబంధించినవే కాగా, వాటి అమలులో విఫలమైన ముఖ్యమంత్రి, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తాజాగా రెండు కొత్త అంశాలపై ప్రచార ఉధృతిని పెంచారు.
ఇది కూడా తన ప్రస్తుత మానసిక స్థితి నుంచి వచ్చిన ఎత్తుగడే. ఆ రెండు అంశాల్లో ఒకటి బీజేపీని, మోదీని ఎన్నడూ లేని ఘాటుతనంతో విమర్శించడం. రెండు, తెలంగాణలో అన్ని సీట్లు గెలిపించి రాహుల్గాంధీని ప్రధాని చేయాలనటం. యథాతథంగా ఆ విమర్శల్లో, ఆ కోరికలో ఆక్షేపించవలసిందేమీ లేదు. కాని ఆయన రహస్య ఉద్దేశం ప్రజల దృష్టిని హామీల అమలు నుంచి ఆ రెండు విషయాల వైపు మరల్చడం. ఆ పేరిట ఘన విజయం సాధిస్తే హామీల అమలు కోసం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి తప్పించుకోగలగటం. ఆత్మరక్షణ వ్యూహం బాగానే ఉంది. కానీ, ఫలితాలు మరొక విధంగా ఉంటే? అప్పుడు హామీల కోసం ప్రజల ఒత్తిడి ఏ విధంగా ఉండవచ్చునో ముఖ్యమంత్రి తన అంచనాలకు తాను రావచ్చు. అప్పుడిక ఏ ఎత్తుగడలూ ఆదుకోవేమో.
టంకశాల అశోక్