దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కృత్రిమమేధ కారణంగా పుట్టుకొస్తున్న డీప్ఫేక్ల వల్ల తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో భారత ఎన్నికల సంఘం కూడా దీని గురించి ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యులతో పాటు జర్నలిస్టులు, ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్కు కూడా వీటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారుతుండటం ఆందోళనకరం.
Deep Fake | ఏఐ సాంకేతికతను వినియోగించి తయారు చేసిన వీడియోలు, ఫొటోలు, 3డీ హాలోగ్రామ్లను వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో షేర్ చేస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు పార్టీలు, అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో మొట్టమొదటగా 2012 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీకి సంబంధించిన 3డీ హోలోగ్రామ్ను వినియోగించారు. హైదరాబాద్కు చెందిన అవంతారి టెక్నాలజీస్ అనే కంపెనీ దీన్ని రూపొందించడం విశేషం. ప్రస్తుతం అవంతారితో పాటు పాలిమాత్ సొల్యూషన్స్, మౌనియమ్ లాంటి అనేక కంపెనీలు ఏఐ రంగంలో సేవలందిస్తున్నాయి.
పెరుగుతున్న సాంకేతికత, సోషల్ మీడియా కారణంగా ఎన్నికల్లో ఏఐ వినియోగం ఎక్కువైంది. ప్రస్తుత ఎన్నికల్లో వివిధ పార్టీలు, అభ్యర్థులు ఏఐ ఆధారిత ప్రచారం కోసం సుమారుగా రూ.415 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏఐ ప్రచారం కోసం ఒక్కో అభ్యర్థి సుమారుగా రూ.10 లక్షలకు పైగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
తమిళనాడుకు చెందిన దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి సంబంధించిన ఏఐ వీడియో రూ.10 లక్షలకు చేసి పెట్టినట్టు మౌనియమ్ కంపెనీ తెలిపింది. ప్రతి ఓటరును చేరుకునే వీలుండటంతో కొన్ని పెద్ద పార్టీలు 10 మిలియన్ డాలర్లకు (రూ.83 కోట్లు) పైగా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొన్ని పార్టీలు తమ ప్రచార ఖర్చులో సుమారుగా 20 శాతానికి పైగా ఏఐ సేవల కోసం వినియోగిస్తున్నాయి.
పార్టీలే కాకుండా కొంతమంది సంపన్న అభ్యర్థులు ఒక్క ఏఐ ప్రచారం కోసమే అనధికారికంగా (80 -90 వేల డాలర్లు) రూ.70 లక్షలకు పైగా వెచ్చిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏఐ సేవలపై దక్షిణాది రాష్ర్టాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాదిలోని బీహార్ రాష్ట్రం ఈ విషయంలో వెనుకబడి ఉన్నది.
ఏఐ ఆధారిత సేవలు అందించే కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒకే రాష్ర్టానికి లేదా ప్రాంతానికి చెందిన ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులతో ఒకే సమయంలో అవి పని చేయడం లేదు. సేవలను బట్టి, కంపెనీలను బట్టి వీటి ధరలు మారిపోతున్నాయి. పాలిమాత్ కంపెనీ వాయిస్ క్లోనింగ్ కోసం రూ.60 వేలు వసూలు చేస్తుండగా.. అవాంతరి సంస్థ రూ.10 లక్షలు తీసుకుంటున్నది. పాలిమాత్ కంపెనీ డిజిటల్ అవతార్ క్రియేషన్ కోసం రూ.లక్ష, వాట్సాప్ ఇంటిగ్రేషన్ కోసం రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నది. అదే సమయంలో అవాంతరి సంస్థ ఒక వీడియో మెసేజ్ కోసం రూ.25, ఒక వాట్సాప్ మెసేజ్ కోసం రూ.30 వరకు తీసుకుంటున్నది.
అయితే డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్నందున మన దేశంలో డీప్ఫేక్లు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. భారత్లో 38 శాతం మంది మాత్రమే డిజిటల్ అక్షరాస్యతను కలిగి ఉన్నారు. నగరాల్లో డిజిటల్ అక్షరాస్యత 61 శాతంతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతమే ఉండటం గమనార్హం.
గతేడాది నవంబర్లో సినీ నటి రష్మిక మందన్నకు సంబంధించిన డీప్ఫేక్ వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం 10 రోజుల్లో డీప్ఫేక్లకు సంబంధించి ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కానీ, అదే నెలలో ముసాయిదా చట్టానికి బదులుగా ఏఐ సంబంధిత కంపెనీలకు సలహాలు, సూచనలు జారీ చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఆ తర్వాత ఐటీ రూల్స్, 2021కి కొత్త నియమ, నిబంధనలను జోడించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. కానీ, దానిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
రాజకీయ పార్టీలకు టెక్నాలజీపై అవగాహన ఉండటంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అవి డీప్ఫేక్లను విరివిగా వాడుతున్నాయి. తద్వారా ప్రజాతీర్పును ప్రభావితం చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. వాటి నుంచి పారదర్శకతను ఆశించలేని పరిస్థితి నెలకొంది. డీప్ఫేక్లకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఇతిసార్’ అనే ఏఐ డిటెక్షన్ టూల్ను ఐఐటీ జోధ్పూర్ రూపొందించింది. ఈ టూల్ను న్యూస్ ఆర్గనైజేషన్ బూమ్ వాడుతుండటం గమనార్హం. ఇలాంటి టూల్లను వినియోగించి కొంతమేరకు డీప్ఫేక్లు, తప్పుడు వార్తలను అడ్డుకుంటున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇటువంటి టూల్ల వ్యయం ఎక్కువ కావడం, వాటి కచ్చితత్వం తక్కువగా (70 శాతమే) ఉండటం ప్రతికూలాంశంగా మారుతున్నది. డీప్ఫేక్లను సృష్టించడం చాలా చౌక కాగా.. వాటిని అడ్డుకునేందుకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం అసలు సమస్యగా మారుతున్నది.
ప్రస్తుత ఎన్నికల్లో ఏఐ పరిమితమైన పాత్రనే పోషిస్తున్నది. కానీ, భవిష్యత్తులో అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. ఏఐ సాంకేతికత కారణంగా ప్రజా తీర్పు ప్రమాదంలో పడే ముప్పును ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కలిగిన ఎన్నికల సంఘం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. డిజిటల్ మీడియా అక్షరాస్యతను పెంచే దిశగా ఎన్నికల సంఘంతో పాటు సోషల్ మీడియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలి. తద్వారా డీప్ఫేక్లను అరికట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లేదంటే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఖాయం.
ఎడిటోరియల్ డెస్క్