ఖమ్మం, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మంలో చేసిన బస్సుయాత్ర ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నామా నాగేశ్వరరావు.. మరోసారి గెలుపు బాటలో పయనించేందుకు ఈ బస్సుయాత్ర మార్గం సుగమం చేసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై సాక్షాత్తూ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అతడి ప్రచారంలో కీలక నేతలు మొక్కుబడిగా పాల్గొనడం, ప్రచార వేదికలపైనే నేతల అనుచరులు ఒకరిపై మరొకరు వ్యతిరేక నినాదాలు చేసుకోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.
దీంతో ‘కాంగ్రెస్లో ఐక్యత మిధ్య’ అనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపు భారం మాత్రం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనే పడిన పరిస్థితి నెలకొంది. పొంగులేటి.. ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జితోపాటు అభ్యర్థి రఘురాంరెడ్డికి స్వయాన వియ్యంకుడు. దీంతో ఆయనే ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే మిగిలిన నేతల నుంచి ఆశించిన సహకారం లభించడంలేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఒకరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మహబూబాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండడంతో అక్కడి ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూనే ఖమ్మం ప్రచారంపై దృష్టి సారించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వాటిల్లో మూడు నియోజకవర్గాల నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థి రఘురాంరెడ్డితోపాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.
టికెట్ ఆశించిన నేతలు ప్రచారానికి దూరం..
అయితే, ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతల్లో పొంగులేటి ప్రసాద్రెడ్డి మాత్రమే ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నేతల్లో కొందరు ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ చేసి అనేకసార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈసారి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి నిమిషం వరకూ అలుపెరుగని పోరాటం చేశారు. అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మొండిచేయి చూపింది. దీంతో తమకు ప్రాధాన్యం లభించడం లేదంటూ వారు రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, వీవీసీ రాజేంద్రప్రసాద్, తుమ్మల యుగంధర్ తదితరులు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో వారి సామాజికవర్గం ఓట్లు కీలకం కావడంతో అవి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూనే ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని జిల్లా పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్లో అనేకచోట్ల కొత్త, పాత నేతలకు పొసగడం లేదు. ఒకరి పెత్తనాన్ని మరొకరు సహించకపోవడం లేదు. కొన్నిసార్లు బహిరంగంగానే వాగ్వాదాలకు దిగుతున్నారు. దీంతో నిత్యం కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. కాగా, ఒకవైపు జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అపూర్వ స్పందన లభించడం, అశేష ప్రజావాహిని హాజరుకావడం వంటివి కాంగ్రెస్ వర్గాలను కలవరపరుస్తున్నాయి. అయితే, అద్భుతంగా విజయవంతమైన కేసీఆర్ రోడ్షో కాంగ్రెస్ను డీలా పడేసేలా చేసిందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.