హైదరాబాద్ : రాబోయే హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను ప్రజలు ఆశీర్వదించాలి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కోరారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో నవతరాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. బీసీ వర్గాలకు అనేక రాజకీయ పదవులు ఇస్తున్నారని తెలిపారు. గెల్లు శ్రీనివాస్ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న నాయకుడని.. నాగార్జున సాగర్లో నోముల భగత్కు టికెట్ ఇవ్వడం సరైందేనని ప్రజలు నిరూపించారన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే వాళ్లు టీఆర్ఎస్కు ఓటు వేస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని మంత్రి అన్నారు. రేవంత్రెడ్డి నోరు, ఒళ్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలో జరిగిందన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఎదైనా ఉందా? బీజేపీ, కాంగ్రెస్ చెప్పాలన్నారు.
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వైకుంఠధామాలు అద్భుతమైన ముందడుగన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న అద్భుతాలేంటో చూపించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు దేశంలో ఎక్కడైనా కడుతున్నారా? అని ప్రశ్నించారు. దళితబంధు పథకం హుజూరాబాద్ ఎన్నికల కోసమే ప్రారంభించింది కాదని స్పష్టం చేశారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడైన గెల్లు శ్రీనివాస్కు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. హుజూరాబాద్ ప్రజలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించాలి విజ్ఞప్తి చేశారు.