న్యూఢిల్లీ : భారతదేశ గర్వం.. దాని సంప్రదాయ పరిజ్ఞానంలో ఉందని, దానికి ఇతర దేశాలను కాపీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT) ‘భారత్ వైభవ్’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు. భారతదేశం తన విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచమంతా పంచుకునేందుకు పుట్టిందని చెప్పారు. దేశ సమాచారం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి, విస్తృత ప్రచారం చేయాలన్నారు.
చైనా, అమెరికా, రష్యా చేసేలా మనం ఎందుకు పనులు చేయలేమని.. తరచూ అడిగేవారని, అయితే, మన పనులను మనం సొంత పద్ధతిలోనే చేసుకోవాలన్నారు. గత జాతీయ విద్యావిధానం ‘మన సొంత ప్రజల గొప్ప పనుల’పై సరిగా తెలుపలేదని, కొత్త జాతీయ విద్యా విధానం భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. ‘మన దేశంలో ఏమి బోధించినా.. అది ‘మన ప్రజల గొప్ప పనుల’ను చెప్పకపోతే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ‘భారత్ వైభవ్’ పుస్తకం దేశ వివిధ కోణాలను, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థ, ప్రాచీన సంస్కృతి, నాగరికత అవసరాన్ని నేటి ప్రపంచానికి అందిస్తుందని మోహన్ భగవత్ పేర్కొన్నారు.