అల్జీరియా : ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఘోర ఘటన చోటు చేసుకున్నది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 25 మంది సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధ్రువీకరించారు. బెర్బర్స్ పర్వతం, కబైలియా ప్రాంతంలో మంటలు వ్యాపించగా.. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేసింది. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో నలుగురు సైనికులు తీవ్రగాయాలకు గురయ్యారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కనీసం మరో ఏడుగురు పౌరులు మృతి చెందారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు పేర్కొంది. కబైలియా ప్రాంతంలో, పలుప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.
అల్జీరియన్ అధికారులు పౌరులు అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు, ఆయా ప్రాంతాల నుంచి వారిని ఖాళీ చేయడానికి సహాయం అందించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. చాలా ప్రాంతంలో అడవుల్లో మంటలు వ్యాపించగా.. కబైలియా ప్రాంతంలోని కుటుంబాల జీవనోపాధిని అందించే ఆలివ్ చెట్లు కాలిపోగా.. పశువులు మృత్యువాతపడ్డాయి. అయితే, అడవుల్లో మంటలు చెలరేగడంపై కుట్ర జరిగి ఉండొచ్చని ఇంటీరియర్ మినిస్టర్ అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. బాధితులకు పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి 13 ప్రావిన్స్ల్లో కార్చిచ్చుకు అడవులు కాలిబూడిదవుతున్నాయి. మంటల్లో చిక్కుకొని ఇప్పటి వరకు 42 మంది వరకు మృతి చెందారు.