- విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరు
– ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి వంశీ
జూలూరుపాడు, జూలై 14 : విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ అన్నారు. ఫీజు బకాయిల విడుదలను కాంక్షిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిర్వహించ తలపెట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి బయల్దేరుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీతో పాటు జిల్లా నాయకులు అనిల్ కుమార్, అఖిల్, బాలాజీని పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గుగులోతు వంశీ మాట్లాడుతూ.. విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయడం నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతూ అనేక అవస్థలు పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.