PAK Army : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావల్కోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు (Security forces) కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (Islamabad) పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాకిస్థాన్ (Pakistan) కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.
కాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్లో ఉన్న వైట్హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పెద్దఎత్తున హింస చేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవ హక్కులని కాలరాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. పీవోకేలోని పౌర నివాస ప్రాంతాల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇంతలోనే మరోసారి ఆ ప్రాంతంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.