పిల్లలకు సీసాతో పాలు పట్టడం అన్నది ఒక ఫ్యాషన్లా మారింది. పుట్టిన మొదటి రోజునుంచే ఈ ప్రమాదకర మార్గంలో పసివాళ్ల ప్రయాణం మొదలవుతున్నది. దీనివల్ల అనేక నష్టాలున్నాయి.
ప్రసవానంతరం మొదటి కొద్దిరోజులు చనుబాలు రానప్పుడు, కొందరు సీసాతో బిడ్డకు పాలు ఇస్తుంటారు. ఇది ప్రమాదకరం. ఒకసారి సీసాకు అలవాటుపడిన పిల్లలకు తల్లిపాలపై ఆసక్తి తగ్గుతుంది. క్రమంగా అమ్మ పాలు తాగడమే మానేస్తారు. దీనివల్ల తల్లిలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్నే ‘నిపుల్ కన్ఫ్యూషన్’ అంటారు.
సీసాను నిటారుగా కాకుండా అడ్డంగా పట్టుకున్నట్లయితే, శిశువు పాలతోపాటు గాలినీ పీలుస్తాడు. దీంతో సగం కడుపు గాలితో నిండిపోయి, తగినన్ని పాలు తాగకపోవచ్చు. కడుపులో గాలి ఎక్కువగా చేరడం వల్ల పొట్ట నొప్పి రావచ్చు. ఈ గాలి కడుపులో నుంచి నోటిద్వారా బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాంతులవుతాయి. ఎక్కిళ్ళు కూడా ఎక్కువగా వస్తాయి.
పాలు తాగించడానికి ముందు ప్రతిసారీ సీసాను మరిగించి స్టెరిలైజ్ చేయాలి. లేకపోతే సీసాకు అంటుకొని ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా, బిడ్డకు అతిసార వ్యాధి రావచ్చు. స్టెరిలైజ్ చేసినా కొన్నిసార్లు సీసా జారి బుగ్గలకో, బట్టలకో తగలడం వల్ల కూడా సీసా పీకకు బ్యాక్టీరియా అంటుకోవచ్చు కూడా.
సీసా పాలు తాగిన కొందరు పిల్లలు స్థూలకాయులు అవుతున్నారు. ఎన్నిపాలు సరిపోతున్నాయన్న విషయంలో అవగాహన లేకపోవడంతో, తల్లులు అవసరానికి మించి సీసా పాలు ఇస్తారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. భారీకాయం ఉన్నవారికి భవిష్యత్తులో గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, పిత్తాశయంలో రాళ్ళు.. మొదలైన సమస్యలు రావచ్చు. చిన్న వయసులోనే అకాల మరణాలు సంభవించవచ్చు.
బిడ్డలను నిద్రపుచ్చడానికి కొందరు తల్లులు రాత్రిపూట సీసా అందిస్తుంటారు. దీనివల్ల రాత్రంతా నోట్లో పాలు నిలిచిపోతాయి. వాటినుంచి తయారైన ఆమ్లాలు దంతక్షయానికి దారి తీస్తాయి. దీనిని ‘డెంటల్ కేరిస్’ అంటారు.
బిడ్డను పడుకోబెట్టి సీసా పాలు ఇస్తే, చెవిలో చీము వచ్చే ఆస్కారం అధికం. సీసాలోని పాలు నోట్లోనుంచి యూస్టేషిన్ గొట్టం ద్వారా చెవిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి శక్తి తగ్గిపోవచ్చు కూడా.
సీసా పాలు తాగే పిల్లలకు ‘ఆస్పిరేషన్ న్యుమోనియా’ అనే శ్వాసకోశ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. పాలు సీసా నుంచి వేగంగా ప్రవహించినప్పుడు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీనివల్ల పాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి న్యుమోనియాకు దారితీస్తుంది. పాలు మరీ ఎక్కువ మోతాదులో ప్రవేశిస్తే శ్వాస తీసుకోవడం కష్టమై, శిశువు మరణించవచ్చు.
సీసాతో పాలు తాగిస్తున్నప్పుడు మాతాశిశు అనుబంధం వృద్ధి చెందే అవకాశం తక్కువ. ఇది బిడ్డలలో అకారణమైన ఏడుపు, చికాకులకు దారితీస్తుంది.
దీర్ఘకాలం సీసా పాలు తాగడం వల్ల దంతాలు ఎగుడు దిగుడుగా వస్తాయి.
సీసా పాలు తాగే పిల్లల్లో ఉచ్ఛారణ పరమైన లోపాలు వస్త్తాయని పరిశోధనలు నిరూపించాయి. కాబట్టి, తల్లులు బిడ్డలకు తప్పకుండా తమ పాలనే ఇవ్వాలి.