Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయనకు వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో షూటింగ్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ‘ఎన్బికె111’ చిత్రబృందం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరు సమీపంలోని హోస్కోట్-కంబలిపుర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కాటేరమ్మ అమ్మవారి ఆలయంలో మహాయాగం నిర్వహించారు. ఉదయం నుంచి శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో బాలకృష్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ మహాయాగంలో సుమారు 18 మంది వేద పండితులు, రుత్వికులు పాల్గొని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక మంత్రోచ్ఛారణల మధ్య చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నందమూరి అభిమానులు, చిత్రబృందానికి చెందిన పలువురు సభ్యులు పాల్గొని బాలయ్య ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. గాయంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, తన వల్ల సినిమా పనులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ చిత్రబృందానికి తను లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించుకోవాలని సూచించినట్లు సమాచారం. వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావాన్ని అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
అలాగే సినిమా షూటింగ్ కంటే ముందు హీరో ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక యాగం నిర్వహించిన దర్శకుడు గోపీచంద్ మలినేనిపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణపై ఆయనకు ఉన్న గౌరవం, అభిమానానికి ఈ కార్యక్రమం నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైద్యుల సూచనల మేరకు బాలకృష్ణ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాత ‘ఎన్బికె111’ తదుపరి షెడ్యూల్లో పాల్గొనే అవకాశముంది. అభిమానుల ప్రార్థనలు, చిత్రబృందం నిర్వహించిన ప్రత్యేక పూజలతో బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ సెట్స్లోకి అడుగుపెడతారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.