న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మానవ చరిత్రలో మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య కంటే వృద్ధుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం 2025లో ఈ జనాభా సంబంధిత మార్పు సంభవించింది. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న ఆయుర్దాయం కారణంగా గత ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 65 ఏండ్లు పైబడిన వారి జనాభా శిశువులు, పసిపిల్లలు, ప్రీస్కూల్ పిల్లల జనాభాను అధిగమించింది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వృద్ధ జనాభా కలిగిన దేశాల జాబితాలో అమెరికా 48వ స్థానంలో ఉంది. అక్కడ 65 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి జనాభా 18.9 శాతంగా ఉంది. 2056 నాటికి ఈ సంఖ్య 23.4 శాతానికి పెరుగుతుందని అంచనా. అయితే ఇతర దేశాలలో వృద్ధాప్య జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో అమెరికా ర్యాంకింగ్ 110వ స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.
65 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి సంఖ్య 2025 నాటికి 85.20 కోట్లు ఉండగా 2060 నాటికి అది 200 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం నికర జనాభా పెరుగుదలలో ఇది ఏకంగా 55 శాతానికి సమానంగా ఉంటుందని ఆక్సియోస్ పేర్కొంది. 2025 నాటికి ప్రపంచ జనాభా 813 కోట్లు ఉండగా 2060 నాటికి అది 1,023 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే భూమిపై ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏండ్లు పైబడినవారు ఉంటారు.