భోపాల్ : ప్రభుత్వాలు చేయలేనిది ఒక కుర్రాడు చేసి చూపించాడు. జనాలు వేస్తున్న చెత్తతో డంపింగ్ యార్డులా మారిపోయిన నదిని ఒక్కడే శుభ్రం చేసి శభాష్ అనిపించాడు. అతనే సురేంద్ర సింగ్ చౌదరి. సోషల్ మీడియాలో బిట్టు తబాహిగా ఫేమస్ అయ్యాడు. తాజాగా అతనికి నెదర్లాండ్స్కు చెందిన ఓ పర్యావరణ సంస్థ తమతో కలిసి పనిచేయాలంటూ ఉద్యోగ ఆహ్వానాన్ని పంపిస్తూ పోస్టు చేసింది. మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లా బయారా గ్రామానికి చెందిన సురేంద్ర స్థానిక గుడికి దగ్గరగా వెళ్లే అజ్నర్ నదిని ప్రజలు చెత్త వేసి డంపింగ్ యార్డులా మార్చేయడాన్ని తట్టుకోలేకపోయాడు.
జనవరి 26న నదిని శుభ్రం చేసే పనిని మొదలు పెట్టాడు. ఒక్కడే ప్రతి రోజూ మూడు గంటల పాటు చెత్తను చేతులతోనే ఏరివేయసాగాడు. మధ్యలో కాళ్లు, చేతులకు చర్మ వ్యాధులు వచ్చాయి. చివరికి రూ.30 వేల దాకా ఖర్చు చేసి యంత్రాలతో చెత్తంతా తీసేయించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందాడు.