Indian Idol 16 Winner | దేశవ్యాప్తంగా సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ 16’ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ఒడిశాకు చెందిన ప్రముఖ గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. ఆమెకు రూ.20 లక్షల నగదు బహుమతిని కూడా నిర్వాహకులు ప్రదానం చేసినట్లు సమాచారం. జ్యోతిర్మయి నాయక్ ఇప్పటికే ఒడిశా సంగీత రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందు క్యాన్సర్తో పోరాడుతున్న బాధితులకు మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఉపశమనం కలిగించే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగీతం ద్వారా ఆనందాన్ని పంచాలనే ఆలోచనతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు జాతీయ స్థాయి విజయంగా మారింది.
గ్రాండ్ ఫినాలేలో అన్షికా చోంకర్, మన్రాజ్ వీర్ సింగ్, మైసమ్ బోసు, సుహైల్ సూఫీ, తనిష్క్ శుక్లా వంటి బలమైన పోటీదారులతో జ్యోతిర్మయి తలపడింది. అయితే ‘సైయాన్ ఓ సైయాన్’ పాటకు ఆమె ఇచ్చిన అద్భుత ప్రదర్శన న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చివరికి అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ సీజన్ మొత్తం జ్యోతిర్మయి పాడిన అనేక పాటలు ప్రశంసలు అందుకున్నాయి. ‘ఓ జబ్ తక్ హై జాన్ జానే జహాన్ మై నాచుంగీ’ పాటకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. అలాగే ‘జానే క్యోం లోగ్ మొహబ్బత్ కియా కర్తే హైన్’ పాటను విన్న ప్రముఖ నటి లీనా చందావర్కర్ భావోద్వేగానికి గురైనట్లు షోలో చూపించారు.
విజయం అనంతరం జ్యోతిర్మయి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. “ఇండియన్ ఐడల్ 16 విజేతగా నిలవడం నా జీవితంలో మరచిపోలేని క్షణం. చిన్న ఆశతో మొదలైన ఈ ప్రయాణం నా జీవితాన్నే మార్చేసింది. ప్రతి ప్రదర్శన నన్ను మంచి గాయనిగానే కాకుండా మంచి మనిషిగా తీర్చిదిద్దింది” అని ఆమె అన్నారు. తనకు అండగా నిలిచిన న్యాయనిర్ణేతలు, యాంకర్ ఆదిత్య నారాయణ్, షో నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాన న్యాయనిర్ణేతలు శ్రేయా ఘోషల్, బాద్షాలతో పాటు సంగీత దిగ్గజాలు ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పాపన్, కుమార్ సాను, అలాగే షెహనాజ్ గిల్, ఊర్మిళ మటోండ్కర్ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు.