Stock markets : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై విధించిన టారిఫ్ల భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) శుక్రవారం కుప్పకూలాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 80 వేల మార్క్ దిగువకు పడిపోయింది. మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. దాంతో మదుపరులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
భారత్ నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచామని, రష్యా నుంచి చమురు దిగుమతిని కొనసాగిస్తే ఈ టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన దేశీయ మార్కెట్లలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీనికితోడు విదేశీ సంస్థాగత మదుపరులు నిరంతరాయంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పతనం మరింత తీవ్రమైంది.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 765.47 పాయింట్లు నష్టపోయి 79,857.79 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 79,775 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా తాకింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి 24,363.30 వద్ద ముగిసింది.
రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ బాస్కెట్లో భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, టైటాన్ లాంటి కొన్ని షేర్లు మాత్రమే లాభపడ్డాయి. కాగా వరుసగా ఆరో వారంలోనూ మార్కెట్లు నష్టాలతోనే ముగియడం గమనార్హం.