Loksabha Elections 2024 : ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా తాజా వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు భగ్గుమన్నారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు అరబ్బులుగా కనిపిస్తున్నారని పిట్రోడా వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకర వాతావరణంలో బ్రతికారని, అక్కడక్కడ చిన్నచిన్న స్పర్థలు తప్ప ఏమీలేవని ఆయన అన్నారు.
అయితే పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నల్లగా ఉన్నవారిని ఆయన అవమానిస్తున్నారని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పిట్రోడా వ్యాఖ్యలను తప్పుపట్టారు. మరోవైపు మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించారు. పిట్రోడా వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమని, భారత భౌగోళిక కూర్పు గురించి ఆయనకు ఏమీ తెలియదని వెల్లడైందని అన్నారు. కాంగ్రెస్ ఈ తరహా విభజించి పాలించు విధానాన్ని అనుసరిస్తుందని మండిపడ్డారు.
ఈశాన్య ప్రాంతం వారు చైనీయుల్లా ఉంటారని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. తాము భారత్లో భాగమని, చైనాకు చెందినవారం కాదని స్పష్టం చేశారు. తామంతా భారతీయులమని, ఈశాన్య ప్రజలంతా కలిసిమెలసి జీవిస్తామని చెప్పారు. ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలను పిట్రోడా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయించేందుకు న్యాయ సలహా తీసుకుంటానని మణిపూర్ సీఎం చెప్పారు.
Read More :
EVM | ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు