KTR | యాదాద్రి భువనగిరి, మే 19 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించేవాళ్లు కాదు.. గల్లాపట్టి అడిగేటోళ్లు ఉండాలె’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరులో ఆదివారం నిర్వహించిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
‘రేవంత్రెడ్డికి బాకా ఊదేవాళ్లు కావాలా? మేధావులు కావాలా? బ్లాక్మెయిలర్, లాబీయింగ్ చేసి పైశాచిక ఆనందం పొందేవారు కావాలా? ప్రజాసమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా? ఆలోచించుకోవాలి’అని సూచించారు. కాంగ్రెస్ అభ్య ర్థి తీన్మార్ మల్లన్న, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని అన్నారని, ఇలాం టి తప్పుడు వ్యక్తులకు చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్పాలని అన్నా రు.
రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను గల్లాపట్టి నిలదీసేందుకు రాకేశ్రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చదువుకున్న వ్యక్తులుగా మాట్లాడకుండా ఉందామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను, కాంగ్రెస్ ఇచ్చినట్టు రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి రేవంత్రెడ్డికి సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. ఐదు నెలల్లోనే రైతాంగం ఆగమాగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ పూటకోమాట మారుస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికీ రైతుల ధాన్యం కొనటం లేదని, రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.
ఆధునిక ఆలయాలను నిర్మించాం
‘బీజేపీ వాళ్లు అయోధ్య రామాలయం కట్టామని ఓట్లు అడుగుతున్నరు. యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు. కానీ గుడి పేరుతో ఓట్లు అడుగలేదు. మేం ఆధునిక ఆలయాలను నిర్మించాం. వాటికి కూడా దేవుడి పేరుపైనే నిర్మించాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని, చేసిన పనిని చెప్పుకోలేదని, రెండోది కొన్ని వర్గాలను దూరం చేసుకున్నామని వివరించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని, ఫ్లోరైడ్ రక్కసిని పారదోలామని, దేశంలో ఎక్కడాలేని విధంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇవన్నీ చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు. ఇక, ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. పదేండ్లు ప్రధానిగా ఉండి ఏం చేశారంటే.. పది నిమిషాలు కూడా చెప్పుకోలేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు ‘ఎమ్మెల్సీ’ గౌరవ వేతనమిస్తా: రాకేశ్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి తన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చానని, రాకేశ్రెడ్డి ఏం ఇస్తారని సవాల్ విసురుతున్నారని, తాను ఇవ్వడానికి తన వద్ద ఏం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు.
గెలిపిస్తే తన గౌరవ వేతనాన్ని పేద
విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నిధులనూ నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.