Sri Lanka : చేపల వేట కోసం వెళ్లిన భారతీయ నౌక శ్రీలంక జలాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో నౌకలోని సిబ్బందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని గురువారం శ్రీలంక నేవీ వెల్లడించింది. వారి వివరాల ప్రకారం.. 11 మంది జాలర్లు, సిబ్బందితో కూడిన భారత నౌక బుధవారం, సముద్రంలో వేటకు వెళ్లింది. ఈ క్రమంలో భారత ప్రాదేశిక జలాల్ని దాటేశారు. ఇంటర్నేషనల్ మారిటైమ్ సరిహద్దును దాటి, శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. ఇలా వెళ్తుండగా ఈ నౌక శ్రీలంక ఉత్తర తీరంలో, నెడుంతీవు అని పిలిచే డెల్ట్ ఐలాండ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక పగడపు దిబ్బకు నౌక గుద్దుకుని, ధ్వంసమైంది.
ఇదే సమయంలో అక్రమంగా తమ జలాల్లోకి భారత నౌక రావడాన్ని గమనించిన శ్రీలంక నేవీ వారిని సమీపించింది. నౌకలోని వారితో ప్రమాదం లేదని గుర్తించింది. ఈ నౌక ప్రమాదానికి గురైందని తెలుసుకుని, సహాయక బృందాలకు సమాచారం అందించారు. వారు వచ్చి, నౌకలోని 11 మంది భారతీయుల్ని రక్షించారు. ఈ ఘటనలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 11 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ.. వారి విషయంలో చట్టపరంగా వ్యవహరిస్తామని తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం పాల్క్ అనే జలసంధి వద్ద ఉంది. ఇది శ్రీలంక ఆధీనంలో ఉంటుంది. ఇక్కడికి భారతీయ నౌకలు కొన్నిసార్లు దారితప్పి వెళ్తుంటాయి. దీంతో వారిని శ్రీలంక నేవీ అరెస్టు చేస్తుంది.
అలాగే, అక్కడి నుంచి వచ్చే జాలర్లు కొన్నిసార్లు భారతీయ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో వీరిని ఇండియన్ నేవీ అరెస్టు చేస్తుంది. ఇలా నిత్యం రెండు దేశాల మధ్య జాలర్ల అరెస్టులు సాధారణమైపోయాయి. ఈ ప్రదేశంలో చేపలు ఎక్కువగా ఉండటం వల్ల రెండు దేశాలకు చెందిన జాలర్లు ఇక్కడ చేపల వేట కొనసాగిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దు దాటి ఒకరి జలాల్లోకి ఇంకొకరు ప్రవేశిస్తుంటారు. ఇలా అరెస్టు చేసిన వారిని నిబంధనలకు అనుగుణంగా విడుదల చేస్తుంటారు.