School Fees | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని (ఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తున్నట్టుగానే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ఖరారు చేయనున్నది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారు.
ఈ బిల్లు ఆమోదం పొందగానే చట్టంగా మారుతుంది. ఆ చట్టం ఆధారంగా ఎఫ్ఆర్సీని ఏర్పాటు చేస్తారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం తెస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇటీవలే మీడియాకు తెలిపారు. ఈ ఏడాది సాధ్యంకాకపోవచ్చని, 2025 -26 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో 11,051 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటి లో కొన్ని బడ్జెట్ స్కూళ్లు, కొన్ని కార్పొరేట్ స్కూళ్లు. మొదట ఫీజులు ఖరారు చేయకుండా స్కూళ్లు ఉల్లంఘించినట్టుగా నిరూపించడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలోనే మొదట ఫీజులు ఖరారు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. బడుల్లోని వసతు లు, ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేయనుంది.
మూడేండ్లకొకసారి..
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీ ఏ, బీఈడీ, లా వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరా రు చేస్తున్నది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ప్రతి మూడేండ్లకోసారి విద్యాసంస్థల ఆదాయ, వ్యయాలు, ఆడిటింగ్ రిపోర్టులు, వసతులను పరిశీలించి ఫీజుల ఖరారు తర్వాత ప్రభుత్వం ఆమోదిస్తున్నది.
ప్రైవేట్ బడుల్లో ఫీజుల ఖరారు కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎఫ్ఆర్సీని ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో వృత్తి వి ద్యాకాలేజీలు 150లోపే ఉన్నాయి. దీంతో ఫీజుల ఖరారు ప్రక్రియ సులభమవుతున్నది. ప్రైవేట్స్కూళ్లు రాష్ట్రంలో 11వేలకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ఒకే ఎఫ్ఆర్సీని ఏర్పాటు చేయడమా? లేక జిల్లాకొకటి ఏర్పాటు చేయా లా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాలుగు స్లాబ్లుగా విభజించి ఫీజులు ఖరారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
గతంలో గవర్నింగ్ కౌన్సిల్..
కేసీఆర్ సర్కారు స్కూల్ ఫీజులను ఖరా రు చేసే అధికారాన్ని గవర్నింగ్ బాడీకి అప్పగించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇ చ్చింది. ఆరుగురు సభ్యులు ఈ బాడీలో ఉంటారని అప్పట్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని ఏడాది కాలంలో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీ స్ట్రక్చర్ను ఖరారు చేస్తుందని అప్పట్లో వెల్లడించింది. ఈ కమిటీలో పాఠశాల కరస్పాండెంట్, పేరెంట్ టీచర్ అసొసియేషన్ అధ్యక్షుడు, టీచర్ ప్రతినిధి, డీఈవో ప్రతినిధి తల్లిదండ్రుల ప్రతినిధి సభ్యులుగా ఉం టారు. ఈ కమిటీ ఖరారు చేసిన ఫీజులను వెబ్సైట్, నోటీసు బోర్డుల్లో పొందుపరచాలి. ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయంతో ఈ గవర్నింగ్ కౌన్సిళ్లు రద్దవుతాయి.
కార్పొరేట్ స్కూళ్లను కట్టడిచేయండి
బడ్జెట్ స్కూళ్లను, కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం ఒకే గాటన కట్టడం సరికాదు. బడ్జెట్ స్కూళ్లు అతి తక్కువ ఫీజులతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. బడ్జెట్ స్కూళ్లు తీసుకునే ఫీజులు రూ. 25వేల లోపే. నాలుగు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. అదే కార్పొరేట్లో రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు ఫీజుగా తీసుకుంటున్నారు. ఇలాంటి కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం కట్టడి చేయాలి. అక్రమాలను నియంత్రించాలి. దోపిడీని అరికట్టాలి. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడ్జెట్ స్కూళ్లను కాపాడాలి.
– ఎస్ఎన్ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి