ఓ యాభై మంది మాజీ ఎమ్మెల్యే అనుచరులు.. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఏకంగా ఇరవై కార్లు.. మరోవర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కగానే భారీ చేజింగ్.. వారిని తరుముతూ నానాహంగామా.. ఢీకొట్టి వాహనాన్ని ఆపి కిడ్నాప్.. దాడికి తీవ్ర ప్రయత్నాలు.. ఇదేదో సినిమా ైక్లెమాక్స్ సీన్ కాదు.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన యదార్థ ఘటన. బీఆర్ఎస్కు చెందిన పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ నాయకులు అడ్డదారిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం.. అసలు ఏం జరిగిందంటే..
మేడ్చల్, మే 19: రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థలపై పట్టుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లను దక్కించుకునేందుకు దాడులు, కిడ్నాప్లకు సైతం దిగుతున్నారు. తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై వస్తున్న పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కారును కాంగ్రెస్ సేనలు వెంబడించాయి. దాడికి, కిడ్నాప్నకు యత్నించి గంటపాటు నరకం చూపించారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు 100 శాతం బీఆర్ఎస్కు చెందినవారే అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే నాగారం, తూంకుంట మున్సిపాలిటీలు, జవహర్నగర్ కార్పొరేషన్లో అవిశ్వాస సమావేశం నిర్వహిస్తే రెండు చోట్లా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది.
ఒక్క జవహర్నగర్లోనే నెగ్గింది. తాజాగా బోడుప్పల్ మేయర్పై అవిశ్వాసానికి కలెక్టర్కు నోటీసిచ్చారు. పీర్జాదిగూడలో బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్రెడ్డిని కుర్చీ దింపేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్న ది. ఓ దశలో ఆయన హత్యకు కూడా భారీ గా స్కెచ్ వేసింది. వీటన్నింటిని ప్రజాస్వా మ్య పద్ధతిలో తిప్పి కొట్టేందుకు నిర్ణయించుకున్న మేయర్ వెంకట్రెడ్డి ఈ నెల 6న తానే అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్ను కలిశారు. వచ్చే నెల 5న అవిశ్వాస సమావేశం పెట్టాలని కలెక్టర్ శనివారం నిర్ణయించారు. ఎలాగైనా అవిశ్వాసం పెట్టకూడదని కలెక్టర్పై కాంగ్రెస్ వర్గీయులు ఒత్తిడి పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయం కనుసైగల్లో ఇదంతా జరిగినట్టు సమాచారం.
క్యాంపునకు వెళ్తుండగా కిడ్నాప్ యత్నం
మేయర్, కార్పొరేటర్లు క్యాంపునకు వెళ్లేందుకు సూర్యాపేట నుంచి వస్తూ హయత్నగర్ వద్ద రింగురోడ్డు ఎక్కారు. అక్కడ 50 మంది వరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అనుచరులు, గూండాలు 20 కార్లలో వేచి ఉన్నారు. మేయర్, కార్పొరేట ర్ల కారు రింగు రోడ్డు ఎక్కగానే వారిని ఆ 20 కార్లు వెంబడించాయి. వారి కార్లను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. కార్లను అడ్డు గా తీసుకొచ్చి, దాడి, కిడ్నాప్కు పాల్పడేలా భయాందోళనకు గురిచేశారు.
మేయర్, కా ర్పొరేటర్లు తమ వాహనాన్ని తాము వెళ్లాల్సిన చోటుకుకాకుండా రింగు రోడ్డు మీ దు గా ప్రయాణించారు. వెంట వస్తున్న వాహ న శ్రేణితో భయబ్రాంతులకు గురవుతూ గంటపాటు బిక్కచచ్చిపోయారు. మీడి యా, పోలీసులు, అనుచరులకు సమాచా రం ఇచ్చారు. ఘట్కేసర్ వద్ద రింగు రోడ్డు దిగుతున్నామని, అక్కడికి రావాలని కోరా రు. పోలీసుల నుంచి స్పందన రాలేదని తెలిసింది. రింగురోడ్డుపై ఒక రౌండ్ పూర్తిగా ప్రయాణించి, తిరిగి ఘట్కేసర్ వద్ద రింగు రోడ్డు దిగి, పీర్జాదిగూడకు చేరుకున్నారు. మీడియాకు సమాచారం వెళ్లిందని తెలియడంతోనే సుధీర్రెడ్డి అనుచరులు వెనక్కి తగ్గినట్టు సమాచారం.
కాంగ్రెస్ గూండాయిజం
మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతున్నదని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆగ్రహ వ్యక్తంచేశారు. పీర్జాదిగూడకు చేరుకున్న అనంతరం విలేకరులతో ఆయన మా ట్లాడుతూ.. మేయర్ పీఠం కావాలంటే కా ర్పొరేటర్ల మద్దతు కావాలి కానీ, గూండాలు అవసరం లేదని చెప్పారు. రింగురోడ్డుపై తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పారు. వారు తమ వాహనాలను ఛేజ్ చేస్తూ ఢీకొట్టే విధంగా, దాడిచేసి, కిడ్నాప్ చేసేలా భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. సుధీర్రెడ్డికి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవుపలికారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్ర మించి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఉ న్నతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ దాడి గర్హనీయం: హరీశ్రావు
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్లను కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురి చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్రం గా ఖండించారు. ‘పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగురోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. డీజీపీ, సీపీలు వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడటం గర్హనీయం. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు.