ముంబై : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ముంబైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహమ్మారిపై చర్చించేందుకు శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహావికాస్ అఘాడి కూటమితో పాటు బీజేపీ, ఎంఎన్ఎస్, ఎస్పీ నాయకులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లాక్డౌన్ భయంతో సొంత రాష్ట్రాల బాటపట్టారు.
కరోనా కేసుల పెరుగుదలతో ఇటీవల ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. వీటిని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యతిరేకించారు. ఇవాళ జరిగే సమావేశంలో పరిస్థితిని వివరించి, మద్దతును కూడగట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం వరకు కఠినమైన వారాంతపు లాక్డౌన్ అమలులో ఉంది. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడకుండా సెక్షన్ 144 విధించారు. వైరస్ను కట్టడించేందుకు రాష్ట్రంలో మూడు వారాల పాటు లాక్డౌన్ అవసరమని మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఎం అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. వారాంతపు లాక్డౌన్ను సోమవారం నుంచి పొడగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర అధికారులు తెలిపారు. శుక్రవారం మహారాష్ట్రల్లో 58,993 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదగా.. 301 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 32,88,540కు చేరగా.. మృతుల సంఖ్య 57,329కు పెరిగింది. గత కొద్ది రోజులు మహారాష్ట్రలో 55వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నెల 7న రికార్డు స్థాయిలో 59,907 కేసులు నమోదయ్యాయి.