బీజింగ్ : ప్రపంచ కుబేరుడు, చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్ మాను డ్రాగన్ వదలడం లేదు. ఆయనకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్కు తాజాగా మరో షాక్ ఇచ్చింది. గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలు వ్యతిరేకించారన్న ఆరోపణలపై కొరఢా ఝుళిపించింది. 18.2 బిలియన్ యువాన్లు (2.8 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. జరిమానా 2019లో అలీబాబా దేశీయ అమ్మకాల్లో నాలుగు శాతానికి సమానం. అలీబాబా గ్రూప్ అలీబాబా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకే జరిమానా విధించినట్లు చైనా అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ శనివారం తెలిపింది. ఆన్లైన్ రిటైలింగ్లో పోటీని పరిమితం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడం, న్యాయమైన పోటీని నిలబెట్టడం, దాని ప్లాట్ఫామ్పై వ్యాపారాలను రక్షించడం, వినియోగదారుల హక్కులతో సహా ‘సమగ్ర దిద్దుబాటు’ చర్యలను అలీబాబా అమలు చేయాల్సి ఉంటుందని రెగ్యులేటరీ తెలిపింది. కంపెనీ స్వీయ నియంత్రణపై నివేదికలు వరుసగా మూడు సంవత్సరాల పాటు అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది. చైనా సర్కారు అమలు చేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై గతేడాది జాక్ మా నిప్పులు చెరిగారు. దీంతో అప్పటి నుంచి అలీబాబా గ్రూప్స్పై చైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండు నెలల పాటు జాక్ మా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.