న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజులు గడిచిన కొద్ది రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో వైపు మహమ్మారి బారినపడి 794 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,05,0926కు చేరాయి. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 1,68,436 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా 77,567 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్ కేసులు 10లక్షల మార్క్ను దాటాయి.
ప్రస్తుతం దేశంలో 10,46,631 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,80,75,160 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. దేశంలో రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. వారాంతపు లాక్డౌన్తో పాటు నైట్కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చినా రోజువారీ కేసులు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 11,73,219 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 25.52 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ చెప్పింది.