రుద్రంపూర్, జూలై 27 : గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్లు నిర్వహించాలని, అక్రమ మద్యం, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర దాడులు చేపట్టాలని అధికారులను ఆదేశించినప్పటికీ, స్థానికంగా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల రుద్రంపూర్ సీఎస్ఐ చర్చిలో పైపులు, అనంతరం వంట గ్యాస్ సిలిండర్ దొంగతనానికి గురికాగా, చర్చి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి రుద్రంపూర్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలి ఇంటి నుంచి సిలిండర్ చోరీకి గురైంది. సోమవారం మధ్యాహ్నం గోపి ఏరియాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో సిలిండర్తో పాటు ఇతర గృహోపకరణాలు కూడా దొంగిలించబడినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలపై 100 డయల్కు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
స్థానికుల కథనం ప్రకారం, దొంగిలించిన వస్తువులను గుడుంబా విక్రయించే వారి వద్ద తాకట్టు పెట్టి మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో కొందరు యువకులు గంజాయి మత్తులో వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మత్తు ప్రభావంతో ద్విచక్ర వాహనాలను అతివేగంగా నడపడం, చిన్నచిన్న విషయాలకు గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చిలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు పురోగతిపై ఎలాంటి సమాచారం అందలేదని చర్చి నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అదే ప్రాంతంలో మరోసారి సిలిండర్ దొంగతనం జరగడం దొంగల్లో పోలీసులంటే భయం లేకుండా పోయిందనే భావన కలుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. వరుస దొంగతనాలు, మత్తు పదార్థాల ప్రభావంతో యువకుల ఆగడాలు పెరగడంతో ప్రజలు రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీని మరింత పెంచి, గంజాయి, గుడుంబా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.