అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) పక్కనే కూర్చుని తన లక్ష్యాన్ని వివరించిన విద్యార్థిని 48 గంటల్లో ఆత్మహత్య ( Suicide ) చేసుకోవడం విషాదం ( Tragedy ) నింపింది.ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని అనే విద్యార్థిని అమ్మమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది . అయితే ఆమె వద్ద సూసైడ్ నోట్ లభించినా కాని ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తాను ఏదైనా సాధించి చూపాలని ఉందని, కాని చాలా బాధను అనుభవిస్తున్నానని లేఖలో పేర్కొంది.
ఈనెల 24న రంపచోడవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గ్రామంలో పర్యటించి తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు మెగా పీటీఎం ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముర్రం శివాని పాల్గొని తన కలలను వివరించింది. తాను కష్టపడి చదివి వచ్చే సంవత్సరానికి షైనింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుంటానని వేదిక ద్వారా ప్రసంగించింది. అనంతరం ఆమెను చంద్రబాబు దగ్గరకు తీసుకుని ప్రశంసించారు.
ఇది జరిగిన రెండు రోజులకు విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . ఈ ఘటనపై ఏపీ సీఎం స్పందిస్తూ విద్యార్థిని మృతి తనను కలిచివేస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు. విద్యార్థిని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివాని తండ్రి మురళీకృష్ణ హోటల్లో పనిచేస్తుండగా తల్లి సౌభాగ్యవతి గృహిణిగా ఉంది . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.