ముంబై : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ ముంబైకి చెందిన న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టీకా సరఫరాకు సంబంధించి పూనావాలాను బెదిరించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది దత్తా మానే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. టీకా తయారీదారులు అభద్రతా భావానికి గురైతే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
టీకా విషయంలో తనపై అనూహ్యమైన ఒత్తిడి ఉందని అదర్ పూనావాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అందువల్లే తన కుటుంబంతో కలిసి లండన్కు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దత్తా మానె కోర్టును ఆశ్రయించారు. హోం మంత్రిత్వశాఖ ‘వై’ కేటగిరి భద్రతను కల్పించిందని, అయితే అది సరిపోదన్నారు. బెదిరింపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మహారాష్ట్ర డీజీపీ, పుణె కమిషనర్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.