న్యూఢిల్లీ : ఆర్ఎల్డీ నేత, మాజీ కేంద్రమంత్రి అజిత్సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. రైతు ప్రయోజనాల కోసం అంకిత భావంతో పని చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో పలు విభాగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ట్వీట్ చేశారు. మాజీ కేంద్రమంతి అజిత్ సింగ్ గత నెల 22న కరోనా బారినపడగా.. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి విషమించి.. గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. చరణ్ సింగ్..1979-80లో ఆరు నెలల పాటు భారత ప్రధానిగా సేవంలందించారు.
ఆయన అడుగుజాడల్లో అజిత్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. యూపీలోని బాగ్ పత్ లోక్సభ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో పౌరవిమానయానశాఖ, వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించారు. మొదట విపీ సింగ్ ప్రభుత్వంలో, ఆ తర్వాత పీవీ నరసింహారావు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 1996లో కాంగ్రెస్కు రాజీనామా చేసి.. ఆర్ఎల్డీ పార్టీని స్థాపించారు. ఎన్డీఏలో చేరి.. 2001లో వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. 2003లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్నారు. కాగా, అజిత్ సింగ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్రమంత్రులు సంతాపం తెలిపారు.