హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి కర్నల్ సంతోష్ బాబు అమరుడయ్యారు. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్బాబుతో పాటు కొందరు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సంతోష్బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం భీమరంలో రైతు వేదిక, వైకుంఠ దామం, హైస్కూల్ భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అలాగే ప్రజలకు మరిన్ని వైద్య సేవలు కల్పించేందుకు నకిరేకల్లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా రైతు వేదికను ప్రారంభించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.