పటాన్చెరు టౌన్/రామచంద్రాపురం, మార్చి 31: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నియోజకవర్గ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్కు లేదని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓటమి చవిచూశావని, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఐదు చోట్ల ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టి రెండు చెంపలు గట్టిగా వాయించినా బుద్ధి రాలేదని కాటపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్రావుపై కాటా శ్రీనివాస్గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై తీవ్రంగా ఖండించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు హరీశ్రావు లాఠీ దెబ్బలు తిని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. స్థాయి తప్పి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం. జిల్లా మంత్రి కుమార్తె పెండ్లి పేరుతో ఎన్ని డబ్బులు వసూలు చేశావు. సొంత కుటుంబ సభ్యులపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇబ్బంది పెట్టావు.
మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ చైర్మన్లను చేయడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నావో మాకు తెలుసు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు డబ్బులు వసూలు చేసిన వ్యక్తివి నీవు. ప్రజలతో మంచి సంబంధాలు పెంచుకొని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురా. నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ నుంచి రూ.7కోట్లు తీసుకున్నవ్. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసేందుకు రూ.40లక్షలు తీసుకున్నవని మీ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. తప్పుడు పనులు చేసి రెండున్నర ఏండ్లకే సర్పంచ్ పదవిని చేతగాక వదిలేస్తివి. నీవు నిలకడ లేని వ్యక్తివి.
ఆధారాలతో సహా ఆలోచన చేసి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. తాను 1990 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నానని, సొంత ఆస్తులను అమ్ముకొని రాజకీయం చేస్తున్నానని చెప్పారు. ఇన్ని రోజుల్లో ఒక్క గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే గూడెం సవాలు విసిరారు. మరోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నా
మైనింగ్ గురించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్వారీ కోసం దరఖాస్తు చేస్తే, 2010లో తమకు 15 ఎకరాల క్వారీ కేటాయించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ జాతీయ రహదారి విస్తరణ కోసం పెద్దఎత్తున మైనింగ్ చేసిందన్నారు. ఇదే విషయాన్ని మైనింగ్ శాఖ అధికారులు సైతం తెలిపారన్నారు. అనంతరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తాను క్వారీని నడిపినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చెప్పారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధ్దంగా క్వారీని సీజ్ చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఈ అంశంపై ఫిజికల్గా రీసర్వే నిర్వహించాలని హైకోర్టుకు, సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. జిల్లా మంత్రి ఒత్తిడితో రాత్రికి రాత్రే గూడెం మధుసూదన్ రెడ్డిపై ఐటీ, ఈడీ, ఇరిగేషన్, పొల్యుషన్ అంటూ 11 కేసులు పెట్టి, 30 రోజులు జైల్లో పెట్టారని ఆరోపించారు. క్వారీ తవ్వకాలపై సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే , ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్కు కేటాయించిన ఫైల్ను మాయం చేశారని ఆరోపించారు. పాటిలో ఇటీవల హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలకు తన బంధువులకు సంబంధం ఉందని చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సమావేశంలో నుంచే బాధితులతో ఫోన్లో మాట్లాడారు. అలాగే పోచారంలో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములకు తనకు సంబంధం లేకున్నా చిన్న పిల్లాడిలా కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారని విమర్శించారు. టీజీఐఐసీలో 600 ఎకరాల లావాదేవీలను కాంగ్రెస్ నాయకులు నడిపిస్తున్నారని మహిపాల్ రెడ్డి ఆరోపించారు. రైతులకు చెల్లించే రేటు ఒకటైతే, పరిశ్రమలకు ఇచ్చే రేటు మరొకటని ఆరోపించారు. దీనిపై టీజీఐఐసీ, సంగారెడ్డి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.
చేతనైతే నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి..
– బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి ధ్వజం
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావుపై కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి అన్నారు. స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 2014కు ముందు పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నారు. కేవలం బీఆర్ఎస్తోనే ఇంతటి అభివృద్ధి జరిగిందన్నారు. కాటా శ్రీనివాస్కు చేతనైతే పటాన్చెరు నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేయాలని, అంతేగాని స్థాయిని మరిచి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.
ముందు ఇంట్లో వాళ్లను సరిగ్గా చూసుకో..
– బీఆర్ఎస్ మహిళా నేత కాట సునీత విమర్శలు
ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి మైకుల ముందు ఒర్రడం కాదని, ముందు ఇంట్లో వాళ్లను సరిగ్గా చూసుకోవాలని కాటా శ్రీనివాస్కు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, కాట శ్రీనివాస్గౌడ్ వదిన కాట సునీత విమర్శించారు. తల్లిని, అన్నను, వదినను, తోడబుట్టిన వాళ్లను మోసం చేసిన వ్యక్తివి నీవు అంటూ కాట శ్రీనివాసగౌడ్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సఫాన్దేవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, దేవానంద్, అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, మాజీ జడ్పీటీసీ కొలను బాల్రెడ్డి, నేతలు గూడెం మధుసూదన్ రెడ్డి, సోమిరెడ్డి, గోవర్దన్రెడ్డి, అంతిరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శ్రీధర్చారి, రాములుగౌడ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.