డిసెంబర్ 9 సంగతులు మాట్లాడుకోవాలంటే, నవంబర్ 29 సంగతి మాట్లాడుకోవాలె.
‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’
అన్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురించి మాట్లాడుకోవాలె. డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కానీ, ఆ తర్వాత నాలుగున్నరేండ్లకు తెలంగాణ కల సాకారం కావడానికి కానీ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టే కేసీఆర్ కీలకం. 2001 తర్వాత తెలంగాణ సాధన రాజకీయాలు ఆయన వెంట, ఆయన చుట్టూ తిరిగాయన్నది కూడా నిజమే.
పన్నెండేండ్ల అనంతరం ఆ రోజులు, ఆ వాతావరణం యాదికొస్తున్నప్పుడు తెలంగాణ పోరు పతాకలయి ఎగిరిన రోజులు యాదికొస్తున్నవి. ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది’ అన్న ప్రకటనతో ఎంత ఉద్వేగం నిండిన బతుకులు గడిపినామో, ఎన్ని ఉత్తేజకర, ఉద్విగ్న, ఉన్నత విజయాల ఆశ్వాస, విశ్వాసాలు కలగన్నామో.. కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసి ‘ఏకాభిప్రాయం’ అని ప్రకటించి నాలుగున్నరేండ్ల కాలయాపన చేసిందో.. అంతటి దుఃఖాన్ని ఆవేదనను, అలజడిని, ఆత్మహత్యల రుతువుల, అగాథాలను, అగడ్తలను అనుభవించింది తెలంగాణ. అవన్నీ.. గుర్తుకొస్తున్నాయి.
నిజమే తెలంగాణ ఉద్యమం దశాబ్దాల పాటు జరిగింది. త్యాగాలు చేసింది. సబ్బండ వర్ణాలను, సకల జాతులను ఏకం చేసింది. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ద్రోహ చింతనల పాలయ్యాయి. భంగపడ్డాయి. కానీ మలి తెలంగాణ ఉద్యమం ఎందుకు సఫలమయ్యింది. ఏయే ఎత్తుగడలు, ఏ వ్యూహాలు ఎందుకు విజయం సాధించాయి. అని ఆలోచించినప్పుడు తప్పనిసరిగా డిసెంబర్ 9 ప్రకటన, అందుకు కారణమైన తెలంగాణను కుదిపేసిన ఆ 11 రోజుల గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రకటనకు మూలమైన నవంబర్ 29 చరిత్ర గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ చైతన్యాన్ని శాంతియుత పద్ధతుల్లో ఒక తెలంగాణ సామూహిక నిరసనగా మార్చిన ఎత్తుగడలను తల్చుకోవాలి. వీటికి మూలం మళ్లీ జయశంకర్ మాటల్లోనే… ‘తెలంగాణ ఇప్పుడు చాలా తృప్తికరమైన స్టేజికొచ్చింది. తిరుగులేని స్టేజికొచ్చినం. వెనక్కిబోదు. గతంలో వెనక్కిబోయింది గానీ ఇప్పుడు వెనక్కిబోదు. ఎందుకంటే ఇది పార్టీలకు, వ్యక్తులకు పరిమితమై లేదు. ఈ రోజు ప్రజల్లోకి బోయింది. మాకు (కేసీఆర్తో కలిసి) కోరిక అదే ఉన్నది.
ఇది సిసలైన ప్రజా ఉద్యమం. ‘కేసీఆర్లో నాకొక ప్రత్యేకత కనబడింది. ఈయనలో ఉన్న ప్రత్యేకత నాకెక్కడ కూడా కనబడలే. ఒక సాధనం. తెలంగాణను రాజకీయ ప్రక్రియ ద్వారా తేవాలనుకున్నడు. ఆయన ఇదే అన్నడు. ‘సార్ మీరెంత కష్టపడ్డరు. లైఫంత కష్టపడ్డరు. ‘పొలిటికల్ ప్రాసెస్’ లేంది కాదిది. పొలిటికల్ ప్రాసెస్ కావాల్సిందే మరి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సరిగ్గా ఈ ప్రాసెస్ను రిఫైన్ చేయడానికి ఉపయోగపడ్డడు కేసీఆర్’.. వీటి సారాంశం ఏమిటి? ‘తెలంగాణపై అవగాహన ఉండి, తెలంగాణ ప్రజల భాషలో, నుడికారంలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి కేసీఆర్’ అని కూడా జయశంకర్ స్వయంగా చెప్పారు. ఇదంతా కేసీఆర్ విజన్ను దగ్గరగా చూసిన జయశంకర్ సార్ పరిశీలనే అయినా తెలంగాణ సమాజం కూడా అదే అనుకొన్నది కనుకనే ఆయన వెంట అనుసరించింది.
తెలంగాణ ప్రజా సమితి రాజకీయాలు, ఆ తర్వాత కాంగ్రెస్కు బలైపోయిన తెలంగాణ తొలి ఉద్యమ చరిత్ర నుంచి ఉద్యమ పార్టీలుగా ఏర్పడినా దారీ తెన్నూ లేకుండా దరిచేరకముందే దుకాణాలు మూసుకున్న పార్టీల గురించి, ఒక రాజకీయ లక్ష్యం లేకుండా, కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధించవచ్చుననుకొని, నిర్బంధాల పాలైన ఉద్యమాలను తెలంగాణ రుచి చూసింది. భావజాల వ్యాప్తి జరిగినా, ఉద్యమ కార్యాచరణలు ఎన్నుకున్నా, ఆర్టికల్-3 రాజ్యాంగ హక్కుగా, పార్లమెంట్లో బిల్లు కోసం జరగాల్సిన రాజకీయ క్రమం గురించి ఆలోచించిన వాడు కేసీఆర్. అందుకే 2001 అనంతరం తెలంగాణ రాజకీయాలు ఆయన కేంద్ర బిందువుగా సాగాయి. సాగుతున్నాయి. తెలంగాణకు వందేండ్ల పోరా ట చరిత్ర ఉన్నది. తెలంగాణకు తాత్విక రాజకీయ భూమికే చైతన్యశీలతగా గుర్తించాల్సి ఉన్నది.
కానీ రాజకీయ ఆధిపత్యంలో, తెలంగాణ ఏర్పాటు నుంచి అంతర్గత వలసగా మార్చుకున్న దాకా, అనంతరం ఆర్థిక దోపిడీ వరకు కొనసాగింది. కానీ ఈ ఆర్థిక దోపిడీ మూలాలను ఎదిరించడానికి గానీ, ముందు తెలంగాణ విముక్తి చేసుకోవడానికి గానీ ఒక రాజకీయ ప్రక్రియను, దాని ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాల్లో ఒక బలమైన కేంద్రాన్ని గానీ, ఒక ప్రాంతం మీద పెత్తనం కొనసాగిస్తున్న శక్తుల మీద విజయం సాధించడానికి గానీ స్వీయ రాజకీయ అస్తిత్వ భావనలు పెంపొందించి ఒక రాజకీయశక్తిగా ఎదిగి, ప్రజా ఉద్యమాల వెన్నుదన్నుతో, ఒత్తిడితో రాజకీయ ప్రక్రియను శాంతియుత పద్ధతుల్లో, సంప్రదింపుల మార్గంలో సాధించడం అనే లక్ష్య ప్రకటన చేసినవాడు కేసీఆరే. అందుకు అనుగుణంగా వ్యూహ రచన చేసినవాడు కేసీఆర్.
అందుకే మలి తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరలో బుద్ధిజీవులు, మేధావులు, రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ చెదురుమదురుగా రకరకాల కూటములు. వేదికలు పనిచేస్తున్నప్పటికీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడటమే మలి ఉద్యమానికి తొలి కిరణం అయ్యింది. అంటే రాజకీయ నాయకత్వం, క్రమం లేకుండా పార్లమెంటులో బిల్లు సాధ్యం కాదని ఉన్నప్పటికీ, కాంగ్రెస్ బీజేపీ సహా చాలా పార్టీలు తెలంగాణ ఇస్తామని చెప్తున్నప్పటికీ ఒక రాజకీయ పార్టీ లేకుండా పార్లమెంటులో జరగాల్సిన ప్రక్రియ జరిగే అవకాశం లేదని అందరికీ తెలుసు. అందుకే టీఆర్ఎస్ ఏర్పాటు ఉద్యమంలో ఒక మలుపు అయ్యింది.
స్వీయ రాజకీయ అస్తిత్వంలో తొలి అడుగు వేసిన కేసీఆర్ జలవిహార్ మీదుగా తెలంగాణ నలు చెరుగులా వ్యాపించగలిగారు. ప్రజల్లో ఉన్న ఉద్యమ ఆకాంక్షలను రగిలించగలిగారు. పరీక్షలుగా నిలిచిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్వీయ రాజకీయ పార్టీ విజయాలు ఉద్యమానికి ఒక ఊపును, నిర్మాణాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చిన మాటా నిజమే. కానీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్రెడ్డి అంతరంగంలో తీవ్ర వ్యతిరేకత, కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులకు అమ్ముడుపోయిన సంక్లిష్ట స్థితిలో తెలంగాణ పరిస్థితి క్లిష్టంగా తయారైంది. ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి సంప్రదించి ఏకాభిప్రాయ ప్రకటన చేయించినా కూడా తెలంగాణను మోసం చేసే ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చిన కాంగ్రెస్ మెడలు వంచడానికి.. కేసీఆర్ సంధిం చిన చివరి అస్త్రం ఆమరణ నిరాహార దీక్ష. ఒక పరిపక్వమైన దశ. తెలంగాణ అంతటా భావజాల వ్యాప్తి జరిగినప్పటికీ, ఒక క్రమంలో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ మోసపూరిత విధానాలే అవలంబించింది. సరిగ్గా ఆ సమయంలోనే జయశంకర్ సార్ అన్నట్టు ఒక పరిపక్వ పరిస్థితులను మండించడానికే ‘కేసీఆర్ దీక్ష’ ట్రిగ్గర్ అయ్యింది.
‘కేంద్రం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. రాజీనామాలు, ఉప ఎన్నికలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. చివరికి విసిగిపోయిన తర్వాత కేసీఆర్ అప్పుడు దీక్షకు దిగారు. కనుక సరిగ్గా సమయానికి ట్రిగ్గర్ చేసినట్టు అయ్యింది’
– ప్రొఫెసర్ జయశంకర్
ఆ క్రమం ఇంకా కండ్లముందు కదలాడుతున్నది. నవంబర్ 27న తెలంగాణ భవన్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున మేము మొదటిసారి కేసీఆర్ను కలిసినాం. ఆ దినం ఇంకా గుర్తున్నది. నిరాహార దీక్ష ఏర్పాట్లు పక్కనబెట్టి ఆయన మాతో భోజనం చేస్తూ చాలా విషయాలు మాట్లాడారు. మేము ఆయనకు తెలుగు తల్లి విగ్రహం వద్ద వీడ్కోలు పలికాం. మరుసటిరోజు నేనొక కాలమ్ రాశాను. ‘భద్రత-కుట్ర’ దాని పేరు. ‘తెలంగాణ గాయపడింది. ఆ గాయాన్ని కెలికి లేపకండి. అది నిలువెత్తున నిరసనల పతాకమవుతుంది’ అని కాలమ్ ముగుస్తుంది. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి నిరాహార దీక్షకు బయల్దేరేముందు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కొద్దిసేపు మాట్లాడినాక ‘ఇవ్వాళ్ల అల్లం నారాయణ రాసిన కాలమ్ చదవండి మీకే అంతా అర్థమవుతుంద’ని చెప్పారు (ఆ విలేకరుల సమావేశం నుంచి నారదాసు లక్ష్మణ్రావు నాకు ఫోన్చేసి చెప్పారు). కొంచెం గర్వంగా అనిపించింది. అయితే ఆ కాలమ్ ఇన్పుట్స్ అన్నీ తెలంగాణ భవన్లో కేసీఆర్తో మాట్లాడిన మాటల సారాంశమే.
నిరాహార దీక్ష ప్రారంభం కాకముందే కేసీఆర్ను దౌర్జన్యంగా అరెస్టు చేశారు. ఒక కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన, అన్నింటికి మించి తెలంగాణ కేంద్రంగా ఉన్న కేసీఆర్ను కేంద్ర బలగాలు గ్రేహౌండ్స్ సహాయంతో దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్, ఆ తర్వాత ఖమ్మం అనుభవాలు. ఖమ్మంలో ఆయన మీద ఆయనతోపాటు ఉన్న నాయిని, జయశంకర్ సార్లపై జరిగిన దౌర్జన్యాలు, క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం నేపథ్యంలో తెలంగాణలో ఒక్క కుదుపు ప్రారంభమైంది. ఒక ఆందోళన మొదలైంది.
కేసీఆర్ దీక్ష ఫలితం. ఆయన ఆరోగ్యం మీద సందేహాలు, ప్రభుత్వం రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు. అన్నీ తెలంగాణను అల్లకల్లోలం చేయడం ప్రారంభమైంది. ఒక కొత్త ఆందోళనలకు బీజం పడింది. డిసెంబర్ 3న ఖమ్మంలో ఆరోగ్యం క్షీణించిన కేసీఆర్ను హైదరాబాద్లో నిమ్స్కు తెచ్చారు. ఆ విజువల్స్ చూడటంతో తెలంగాణ ప్రజల్లో గుబులు మొదలైంది. నిమ్స్కు తరలించినప్పుడే ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ‘నా ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రకటిస్తే జైత్రయాత్ర, లేదంటే, నా శవయాత్ర’ అన్నారు. తెలంగాణ భగ్గుమన్నది. బస్సులు బంద్, రైళ్లు బంద్. పంజాగుట్టలో విద్యార్థులు ఏం చేయగలరో ‘మచ్చు’ చూపారు. అంతా అల్లకల్లోలం. తొలి అమరవీరుని ఆత్మహత్య ఆ మరుసటి రోజు జరిగింది. శ్రీకాంతాచారి నిప్పుల గుండం అయ్యిండు. సరిగ్గా ఆ సమయంలోనే నేను కేసీఆర్ ఇంటర్వ్యూకు నిమ్స్కు వెళ్లాను. సంతోష్ పక్కన ఉన్నారు. ఇప్పుడున్న మిలీనియం బ్లాక్లో కేసీఆర్. తలుపు తోసుకొని లోపలికి వెళ్లేసరికి టీవీలో శ్రీకాంతాచారి వార్తలు, కేసీఆర్ కళ్ల వెంట కన్నీరు!
శ్రీకాంతాచారి ఆత్మాహుతి చూసి ‘ఇదేంది ఇట్లా ప్రాణాలు పోవుడేంది. ఏమి గోస ఇది! తెలంగాణ అరిగోస’ అని కేసీఆర్ ఏడుస్తూనే ఉన్నారు. ఆ దుఃఖం నాకు కలకల అనిపించింది. తెల్లారి నా పేరుతో వచ్చిన వార్తలో చాలా స్పష్టంగా ‘తెలంగాణ వస్తేనే దీక్ష విరమణ నేను చచ్చేదాకా దీక్ష కొనసాగుతుంద’ని ప్రకటించారు. ఆ తర్వాత ఆందోళనలు ఉధృతమయ్యాయి. డిసెంబర్ 9 రాత్రి దాకా మంతనాలు సాగాయి. ఢిల్లీ నుంచి నిమ్స్కు, నిమ్స్ నుంచి ఢిల్లీకి.. కేసీఆర్లో ఉన్న ఆ బక్క ప్రాణం అట్లాగే నిలబడింది.
కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదు సార్లు సమావేశమైంది. చివరికి రోశయ్యను హైదరాబాద్ విమానం ఎక్కించి ఆయన ఇంకా చేరకముందే ఢిల్లీలో రాత్రి 11.30 గంటల సమయంలో ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది’ అని చిదంబరం ప్రకటించారు. అదీ విజయం అంటే.. నాడు సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు యూనివర్సిటీలలో ఉత్సవాలు జరిపారు. నిమ్స్లో నీరసంగా పడి ఉన్నప్పటికీ, శరీరం క్షీణించినా అతని మనసు కొట్టుకులాగుతున్న కత్తుల కోలాటం లాగే ఉండింది. అది అత్యంత శాంతిగా చేసిన దీక్ష. మాటలతో మంటలు రేపే ఆ గొంతులో శబ్దం క్షీణించింది. అది తెలంగాణను ఉడికించింది.
అది ఉప్పెనయి ఊడ్చేయకముందే తెలంగాణ ప్రకటన వెలువడింది. ఒక బలమైన కేంద్రంతో రాజకీయ ప్రక్రియ అనే ఆయుధంతో కొట్లాడి, అహింసా దీక్షతో వారిని కట్టుజేసి, సబ్బండవర్గాలను, సకల జనులను ఏకం జేసిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దీక్ష ఒక దిక్సూచి అయ్యింది. తెలంగాణ ప్రకటన అనంతరకాలంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నాలుగున్నరేండ్ల తర్వాత సాకారమైంది. కేసీఆర్ ఆనాటి దీక్షకు, తెలంగాణ ప్రకటనకు సలామ్. జాతి సమైక్యత సమగ్రతల పేరిట రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రంపై అహింసాయుత పద్ధతుల్లో సుదీర్ఘకాలం యుద్ధం చేసిన తెలంగాణ ప్రజలకు, పరిమితులలో కూడా నిలిచి గెలిచిన ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి జేజేలు.
(వ్యాసకర్త: అల్లం నారాయణ, చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.. కేటీఆర్ ట్వీట్
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయి
డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు: మంత్రి హరీశ్ రావు
రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరు లేరు : ఆర్.నారాయణమూర్తి