– బీఆర్ఎస్ పోరాటంతోనే నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్లు తిరిగి ప్రారంభం
– కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం
ఖమ్మం, జూలై 29 : కేసీఆర్పై రాజకీయ విద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలు విఫలం అయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు నాయకత్వంలో పార్టీ చేపట్టిన అవిశ్రాంత పోరాటం, ప్రజల తరఫున చేసిన నిరంతర ఒత్తిడి ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ల మోటార్లను తిరిగి ప్రభుత్వం ప్రారంభించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జల ప్రాణాధారం అని, రాష్ట్ర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేసీఆర్ ఈ మహత్తర ప్రాజెక్టును నిర్మించారన్నారు.
వరుస కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటి భద్రత కల్పించడంలో కాళేశ్వరం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్వహించి, అన్ని పంప్ హౌస్లు, పంపింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగం, ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.