భువనేశ్వర్ : ఒడిశాలో పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో పూరీలోని జగన్నాథ ఆలయ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో భక్తులకు స్వామి వారిని దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు శని, ఆదివారాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు శ్రీ జగన్నాథ్ ఆలయ పరిపాలన (ఎస్జేటీఏ) చెప్పింది.
అలాగే ఒడిశా వెలుపల నుంచి ఆలయానికి వచ్చే భక్తులందరూ 96 గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఒడిశాలో ఇప్పటి వరకు 3.64లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవగా.. 3.43లక్షలకు మంది కోలుకున్నారు. 1,942 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు.