మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 16: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి పేర్కొన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల చట్టాల అమలుకు అనుబంధమైన కార్మిక, విద్య, వైద్య, పోలీస్, బాలల సంరక్షణ సంస్థలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ కృషి చేస్తోందని, అందుకోసం బాలల అదాలత్లను నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, బాలికలపై అత్యాచారాలు నిరోధక చట్టం వంటివి కఠినంగా అమలు చేయాలని, వారి హక్కులకు భంగం కలిగిస్తే కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయదని అమె తెలిపారు. ప్రధానంగా బాల కార్మికులు కనిపిస్తే, కార్మిక, పోలీస్, సీసీఐ, ఐసీడీఎస్ వారితో కలిసి సమష్టిగా తనిఖీలు నిర్వహించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే పనికి కుదుర్చుకున్న యజమానుల్లో చట్టం అంటే భయం కలుగుతుందని, దాంతో చిన్న పిల్లలను పనిలోకి తీసుకోరని సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అందరూ కలిసి పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ లింగ్యా నాయక్, రాచకొండ, సైబరాబాద్ ఏసీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.