బూర్గంపహాడ్, ఆగస్టు 11 : సారపాక పంచాయతీలోని సుందరయ్యనగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కాలనీలో గుత్తేదారు మూడు రోడ్లకు సంబంధించి మట్టిని తొలగించి ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో రెండుసార్లు లెవలింగ్ చేశారని, అయినా ఇప్పటివరకు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికే సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లామని, హామీలు ఇస్తున్నారే తప్ప పని జరగడం లేదని బత్తుల ఆరోపించారు. ఈ నెల 15లోగా రోడ్ల పనులు ప్రారంభించకపోతే టెంట్ వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మరోవైపు డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించి డ్రైనేజీ సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజిని, ఎస్కే.అబీదా, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ షాహదా, ప్రియాంక, జరీనా, షకీరా పాల్గొన్నారు.