న్యూయార్క్: కృత్రిమ మేధపై ఇటీవల భయాందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఏఐతో మానవాళి అంతం అవుతుందని కొందరు నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ఏఐ భద్రత గురించి వస్తున్న భయాలు అన్నీ అబద్ధం అని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని వస్తున్న అభిప్రాయాలను ఆయన విమర్శించారు. ఏఐ పరిశ్రమలో జరుగుతున్న టెక్నాలజీ పరీక్షలను చెక్ చేసేందుకు థార్ట్ పార్టీ అవసరమని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ కూడా ఆ అంశంపై స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలకు చెందిన పలువురు నిపుణులు కూడా కొన్ని రోజులగా ఏఐపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల వల్ల ఏఐ కంపెనీల షేర్లు పడిపోయాయి. సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ స్పందిస్తూ.. ఏఐపై గ్లోబల్ వార్నింగ్ స్కామ్ ఉత్తదే అని, ర్యాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు ఆ వదంతలు వ్యాపింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ నకిలీ వార్తల గుట్టును తాను విప్పుతున్నట్లు చెప్పారు. ఇది రష్యా నకిలీ బెదిరింపులు అని కూడా ఆయన అన్నారు.
ఏఐ రక్షణ కోసం కావాల్సింది బలమైన, స్మార్ట్ అధ్యక్షుడు అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఓ కుట్ర సాగుతోందని, ఈ అంశంలో కేవలం ఒక్క చైనా మాత్రమే సంతోషంగా ఉందని, ఏఐలో ఎవరు విజయం సాధిస్తే, వాళ్లే గెలిచినట్లు అవుతుందని ట్రంప్ అన్నారు. ఏఐ రంగంలో చైనా సాధిస్తున్న అభివృద్ధి పట్ల అమెరికా ఆందోళన చెందుతోందని, ఆ దేశం తన విధానాలను కూడా మార్చుకుంటోందని చైనీస్ మీడియాలో ఇటీవల నిపుణులు పేర్కొన్నారు. ఏఐ పరిశ్రమలో చైనా నుంచి గట్టి పోటీ వస్తున్న విషయాన్ని అమెరికా గ్రహించిందని, ఒకవేళ అమెరికా ఆ రంగంలో మందగిస్తే, అప్పుడు ఏఐ వేగాన్ని చైనా అందుకుంటుందని ఫుడాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిన్ క్వియాంగ్ పేర్కొన్నారు.