Blood Sugar Levels | భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం కొందరిలో ఆకలి, అలసట, నిద్రమత్తు వంటి సమస్యలకు కారణం అవుతుంది. మధుమేహం ఉన్నవారికే కాకుండా, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ భోజనం తర్వాత రక్తంలో చక్కెరలో వచ్చే మార్పులు రోజువారీ శక్తి స్థాయిలు, ఆకలిపై ప్రభావం చూపుతాయి. అయితే మనం ఏ ఆహారం తీసుకుంటున్నామనే దానితో పాటు, దాన్ని ఏ క్రమంలో తీసుకుంటున్నామన్నది కూడా రక్తంలో చక్కెర పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే లేదా త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనికి ప్రతిస్పందనగా శరీరం ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. రక్తంలో ఉన్న చక్కెరను కణాల్లోకి చేరేలా చేయడంలో ఇన్సులిన్ సహాయపడుతుంది. అయితే భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఎంత మేరకు, ఎంత వేగంగా పెరుగుతుందనేది వ్యక్తిని బట్టి మారుతుంది. ఒకే రకమైన కార్బొహైడ్రేట్లను తీసుకున్నా, దానితో పాటు తీసుకునే ఇతర ఆహార పదార్థాలు కూడా ఈ మార్పులపై ప్రభావం చూపుతాయి.
గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరిగి, ఆ తర్వాత తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం, తీపి లేదా ఇతర ఆహారాలపై కోరిక కలగడం, అలసట లేదా నిద్రమత్తు వంటి అనుభూతులు కొందరిలో కనిపించే వీలు ఉంటుంది. శరీరం తరచూ పెద్ద మొత్తంలో ఇన్సులిన్ను విడుదల చేయాల్సిన పరిస్థితి కొనసాగితే కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మధుమేహం అంటే సంక్లిష్టమైన ఆరోగ్య సమస్య అని, దానికి కేవలం భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగడమే కారణం కాదని గుర్తుంచుకోవాలి. భోజనం చేసే క్రమంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా రక్తంలో చక్కెర పెరుగుదలను కొంతవరకు నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. ముందుగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇందులో మొదటి దశ. ముఖ్యంగా ఆకుకూరలు, ఇతర పీచు అధికంగా ఉండే కూరగాయలను భోజనం ప్రారంభంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆ తర్వాత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో భాగంగా చేర్చడం వల్ల కార్బొహైడ్రేట్లు శరీరంలోకి చేరే విధానంపై ప్రభావం చూపుతాయి. చివరిగా బియ్యం, చపాతీ వంటి పిండి పదార్థాలు లేదా చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే ముందుగా పీచు పదార్థాలు, ఆ తర్వాత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, చివరగా పిండి పదార్థాలు, చక్కెరలు తీసుకోవడం ఈ భోజన క్రమంలోని ప్రధాన ఉద్దేశం. అలాగే సాధ్యమైనంత వరకు పీచు అధికంగా ఉండే, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎంచుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లను ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోవడం, శుద్ధి చేసిన చక్కెరలు, అధికంగా ప్రాసెస్ చేసిన కార్బొహైడ్రేట్లను తగ్గించడం కూడా రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతాయి. అయితే కేవలం ఆహారాన్ని తీసుకునే క్రమాన్ని మార్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని భావించకూడదు. మధుమేహం లేదా మధుమేహానికి ముందు దశలో ఉన్నవారికి మొత్తం ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం, మందులు, ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా ముఖ్యమే. అందువల్ల భోజనం చేసే క్రమాన్ని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా పాటించవచ్చు కానీ వైద్యులు సూచించిన చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదని నిపుణులు సూచిస్తున్నారు.