న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రోజువారీ కొవిడ్ కేసులు తాజాగా మరోసారి లక్షకు దిగువన నమోదవగా.. నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 1,21,311 బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కు పెరిగింది.
ఇందులో ఇప్పటి వరకు 2,79,11,384 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,67,081కు చేరింది. ప్రస్తుతం దేశంలో 10,80,690 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్లో మొత్తం 24,96,00,304 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 95.07శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి తక్కువగా పడిపోయిందని, ప్రస్తుతం 4.94 శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 37.62 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.