హైదరాబాద్ : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శనివారం నుంచి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి అమ్మవార్ల దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. కాగా, స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరచినప్పటి నుంచి రాత్రి ఆలయ ద్వారాలు మూసేంత వరకు రోజూవారీగా జరిగే కైంకర్యాలన్నీ యథావిధిగా జరుగుతాయని ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరోక్ష సేవలన్నీ యథావిధిగా కొసాగుతాయని పేర్కొన్నారు.
దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో నిన్నటి వరకు ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చారు. అలాగే మహానంది క్షేత్రంలో దర్శన సమయంలో మార్పులు జరిగాయి. ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు ఇవ్వడంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు.