న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్రమంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ చోటుచేసుకోనున్నదా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు చోటిస్తున్నాయి. మంత్రులతో ప్రధాని మోదీ ఇటీవల తన నివాసంలో మూడుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలకు క్యాబినెట్ మంత్రులోపాటు వారి సహాయమంత్రులు కూడా వస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుగణాభివృద్ధి, మత్స్య, గిరిజనసంక్షేమం, పట్టణాభివృద్ధి, సాంసృ్కతిక, గణాంక, పథకాల అమలు, పౌరవిమానయాన, రైల్వే, ఆహారం-వినియోగదారుల వ్యవహారాలు, జల్శక్తి, పెట్రోలియం, ఉక్కు, పర్యావరణం శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు, సహాయమంత్రులతో మోదీ సమీక్షలు జరిపారు. తమ పనితీరుపై ఆయా మంత్రులు సంక్షిప్తంగా ప్రధానికి వివరించినట్లు సమాచారం. ప్రస్తుత కరోనా వేళ ఎటువంటి కొత్త పథకాలను తీసుకురావచ్చన్నదానిపైనా చర్చించనట్లు తెలుస్తున్నది. ఇదేక్రమంలో శుక్రవారం హోంమంత్రి అమిత్షాతో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ వరుస సమావేశాలకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా హాజరవుతుండటం ఆసక్తిని కలిగిస్తున్నది.
రెండోదఫాలో ఇదే తొలిసారి
వరుసగా రెండోసారి 2019లో అధికారం చేపట్టిన మోదీ.. మంత్రివర్గంలో ఇంతవరకూ మార్పులు చేర్పులు చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు దానికోసమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్న నేపథ్యం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ నాయకురాలు అనుప్రియ పటేల్తో అమిత్షా ఈమధ్య సంప్రదింపులు జరిపారు. మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అనుప్రియకు రెండోసారి అవకాశం లభించలేదు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు చోటు కల్పిస్తారా అన్న అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీతోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
మోదీతో యోగి భేటీ
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోగా… శుక్రవారం మోదీతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశమయ్యారు. యూపీలో మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో యోగి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండేండ్లూ నేనే సీఎం
బెంగళూరు: మరో రెండేండ్ల దాకా తానే సీఎంగా కొనసాగుతానని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తథ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానిస్తుండగా.. ఢిల్లీ అధిష్టానం కూడా యోడియూరప్పను సాగనంపాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యెడియూరప్ప శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.