హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల దాడుల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనా వారు సంయమనం పాటించారని సమర్థించుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో అరాచక శక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల చేతుల్లోకి రాళ్లు, కర్రలు, ఆయుధాలు ఎలా వచ్చాయని నిలదీశారు.
పార్లమెంట్పై దాడి చేసేందుకు కుట్రచేశారని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులతో అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కేంద్రం పాకిస్థాన్కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. మోదీని దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాక్రోచ్ పార్టీ ఏకైక లక్ష్యమని తెలిపారు. గ్లోబరీనా గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సూత్రధారులైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.