న్యూఢిల్లీ : కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 3.15లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రోజువారీ కేసుల పెరుగుదల. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.59 కోట్లకు పెరిగింది. మరో వైపు రెండు రోజులుగా రికార్డు స్థాయిలో రెండువేలకుపైగా కొవిడ్ మరణాలు రికార్డవుతున్నాయి. రోజులు గడిచిన కొద్దీ దేశంలో రోజువారీ కేసులు పెరుగుతూ వస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాలు వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో దేశంలో 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 1,78,841 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965కు పెరిగింది. ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకోగా.. 1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,91,428 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 13,23,30,644 డోసులు వేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 16,51,711 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 27,27,05,103 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.