న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు గురువారం భారత్కు చేరుకోనున్నాయి. భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక దళ కేంద్రం వద్ద జెండా ఊపి వాటిని ప్రారంభించారు. భదౌరియా ఐదు రోజుల పర్యటనలో మూడో రోజు రాఫెల్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలను సకాలంలో డెలివరీ చేసినందుకు ఫ్రెంచ్ ఏరో స్పేస్కు కృతజ్ఞతలు తెలిపారు.
యుద్ధ విమానాలు ఏకభిగిన 8వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశానికి చేరుకోనున్నాయి. నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్ రెండో స్క్వాడ్రన్ ఏర్పాటు మరింత వేగవంతం కానుండగా.. పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. మొదటి స్క్వాడ్రన్ను అంబాలా ఏర్బేస్లో ఏర్పాటు చేశారు.
ఒక్కో స్క్వాడ్రన్లో 18 యుద్ధ విమానాలు ఉండనున్నాయి. సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 జెట్లు రాగా.. కొత్తగా వచ్చే వాటితో ఆ సంఖ్య 18కి చేరనుంది. గతేడాది జూలై 29న రాఫెల్ ఫస్ట్ బ్యాచ్ జెట్లు దేశానికి చేరాయి.