న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వీధి పోరాటానికి తలొగ్గింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనలతో దిగివచ్చింది. విధానపరంగా అతిపెద్ద వెనుకడుగు వేసింది. (Modi govt bends Again) నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరకు శనివారం రాజీనామా చేశారు. అయితే ప్రజల వీధిపోరాటం ఒత్తిడి కారణంగా మోదీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా మార్చుకోవడం కేవలం ఇది రెండోసారి మాత్రమే. అంతేకాక ఈ ఒత్తిడి కారణంగా ఒక మంత్రి తన పదవిని కోల్పోవడం ఇదే మొదటిసారి.
కాగా, 2020లో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్లకు చెందిన రైతులు ఢిల్లీలో పోరాటం చేశారు. ఒక సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసనలు తెలిపారు. చివరకు రైతుల ఆందోళనలతో ఎన్డీఏ ప్రభుత్వం దిగివచ్చింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు 2021 నవంబర్ 19న ప్రధాని మోదీ ప్రకటించారు. విధానపరంగా ఎన్డీఏ ప్రభుత్వం దిగిరావడం ఇదే తొలిసారి.
మరోవైపు రైతుల ఉద్యమానికి, సీజేపీ నిరసనకు ముందు జరిగిన ఇతర ఉద్యమాలు మోదీ ప్రభుత్వాన్ని కదిలించడంలో విఫలమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ధర్నా, 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి 20 వరకు 101 రోజుల పాటు కొనసాగింది. అయితే కోవిడ్ లాక్డౌన్ కారణంగా అది ముగిసింది. సీఏఏ వ్యతిరేక అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ సీఏఏను కేంద్రం ఉపసంహరించుకోలేదు. నాలుగు సంవత్సరాల తర్వాత 2024లో మాత్రమే సీఏఏ నిబంధనలను నోటిఫై చేశారు.
అలాగే 2022లో అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ పథకాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఆ నిరసనలు కూడా విఫలమయ్యాయి. కేవలం రైతుల పోరాటంపై 2021లో తొలిసారి వెనుకడుగు వేసిన మోదీ ప్రభుత్వం, ఐదేళ్ల తర్వాత మరోసారి నీట్ లీక్పై సీజేపీ నేతృత్వంలో జరిగిన విద్యార్థుల ఆందోళనకు దిగివచ్చింది.